జహీరాబాద్, జూలై 20: నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. బుధవారం ఆయన జహీరాబాద్లో పర్యటించి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్తో కలిసి మున్సిపాలిటీ కేంద్రలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23న మంత్రి హరీశ్రావు రానున్నట్లు తెలిపారు. ఈమేరకు పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, డీపీవో సురేశ్మోహన్, డీఎల్పీవో రాఘవరావు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, తహసీల్దార్ పి.నాగేశ్వర్రావుతో పాటు జిల్లాలోని వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, డివిజన్లోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టండి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినంగా వ్యవహిస్తామని కలెక్టర్ శరత్ హెచ్చరించారు. హోతి(కే)లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక, బిల్లులు సకాలంలో చెల్లించినా పనులు చేపట్టకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. తిరిగి టెండర్లు వేసి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆయా నిర్మాణాలను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. రహ్మత్ నగర్లో 312 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, పంపిణీకి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అంతకుముందు రహ్మత్ నగర్లో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. హోతి(కే)లో 660 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయని తెలుపగా, మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
‘మనఊరు-మనబడి’ పనులు వేగం పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘మనఊరు-మనబడి’ పనులు వేగవంతం చేయాలన్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో పనులు ప్రారంభం కాకపోవడంతో కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో, ఎంపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు మనఊరు-మనబడి పనులు పర్యవేక్షణ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధికారులు పనితీరు మార్చుకోవాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. హరిత హారంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా మైదానాలు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి హరీశ్రావు పర్యటన వివరాలు
ఈ నెల 23న జహీరాబాద్, మొగుడంపల్లి మండలంలో ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటన చేస్తారని కలెక్టర్ తెలిపారు. మొగుడంపల్లి, మన్నాపూర్లో నిర్మాణం చేసిన రైతు వేదిక భవనాలు ప్రారంభిస్తారని తెలిపారు. మొగుడంపల్లిలో చించోళి రోడ్డు నుంచి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిర్మాణం చేసిన డివైడర్, సీసీ రోడ్డు, అంబేద్కర్ భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు. మొగుడంపల్లిలో కొత్తగా నిర్మాణం చేసిన ఎస్టీ బాలుర వసతి గృహాన్ని, జహీరాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ ట్యాం కులు, సరార్ దవాఖాన ఆవరణలో కొత్తగా నిర్మాణం చేసే మాత శిశు సంక్షేమ దవాఖాన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేస్తారన్నారు. హమామీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభిస్తారన్నారు. మంత్రి పర్యటన విజవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు.
నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
అందోల్, జూలై 20: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూం పనుల్లో వేగం పెంచాలన్నారు. నిర్మాణాలు పూర్తైన ఇండ్లను ఈ శ్రావణమాసంలో లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే, ‘మనఊరు-మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. గ్రామాల్లో చేపడుతున్న క్రీడా ప్రాంగణాల కోసం స్థలాల సేకరణ ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని, స్థలాలు సేకరించిన చోట్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.