టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి
సంగారెడ్డి కలెక్టరేట్, మే19: సంగారెడ్డి జిల్లాలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని టీఎస్డబ్ల్యూఐడీసీ కార్యాలయంలో మన ఊరు -మన బడి కింద జిల్లాలో సంబంధిత శాఖలకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. సంబంధిత శాఖకు 87 పాఠశాలలు కేటాయించారని, 38 పాఠశాలల పనులు పూర్తి కావచ్చాయని, ఈ నెల 31లోగా ఆయా పాఠశాలల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం, పనులు ప్రారంభించాలని ఇంజినీర్లకు సూ చించారు. అనంతరం సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లోని పలు పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. సంగారెడ్డిలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు, ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో నీటి సంపు నిర్మాణ పనులు పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయనతో ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈఈలు, ఏఈలు, సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.