సిద్దిపేట, జూలై 14 : మారుతున్న ఆరోగ్య అలవాట్లు.. జీవనశైలితో నేడు మానవుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కరోనా తర్వాత అనేకమంది తమ జీవనవిధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నిత్యం కూరగాయల కొనుగోలుకు రైతు బజార్కు వెళ్లేవాడు. అక్కడ లభించే కూరగాయలు పురుగుమందులు రసాయన ఎరువులతో పండించేవి కావడంతో గమనించాడు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఇంటిలో కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేట పట్టణంలోని మోహిన్పురా రాకెట్ బిల్డింగ్ సమీపంలోని తన నివాసంలో మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు పాఠశాలకు వెళ్లి పాఠాలు చెబుతూనే మిగతా సమయాన్ని ఇంటి మేడ మీద ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను పండించుకుంటున్నారు. ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే రసాయనాల వాడకం ఉండకూడదనేది నిపుణుల మాట. ఈ మధ్యనే సేంద్రియ విధానంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మిద్దె తోటల సాగు సిద్దిపేట పట్టణంలో ఓ ఉద్యమంలా సాగుతున్నది. ప్రతిఒక్కరూ మార్కెట్పై ఆధారపడకుండా ఇంటిస్థలంలో కావాల్సిన కూరగాయలను పండించుకుంటేనే మేలుగా ఉంటుందని శ్రీనివాస్ చెబుతున్నారు. మిద్దెపై తోటల పెంపకం నేటి కాంక్రీట్జంగల్లో తప్పనిసరి అయింది. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు చొరవతో ఆకుపచ్చ, పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంపై అందరి దృష్టి మళ్లింది. ఇదే క్రమంలో సిద్దిపేట స్వచ్ఛబడి స్ఫూర్తితో ప్రకృతితో మమేకమవ్వమే సరైన విధానమని భావిస్తూ అనేకమంది మిద్దెతోటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వచ్ఛబడిలో మిద్దె తోటలు సాగు చేసుకునే వారికి అవగాహన కల్పిస్తున్నారు. దీనికితోడు మంత్రి హరీశ్రావు సిద్దిపేటలో ఏ సమావేశం జరిగినా ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయవద్దని చెబుతున్నారు. దీంతో అనేకమంది ఇంట్లో చెత్తతో ఎరువు తయారు చేసుకొని మొక్కలకు వేసుకుంటున్నారు.
ఇంటి పంటతో ఆరోగ్యం, ఆహ్లాదం
సిద్దిపేటలోని మోహిన్పురాకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తన ఇంటి పైభాగంలో అక్కడక్కడ పూలమొక్కలు, ఏపుగా పెరిగిన పండ్ల చెట్లు, మధ్యమధ్యలో ఆకుకూరల పాదులు ఒక్కమాటలో చెప్పాలంటే అదొక అందమైన మినీ పార్క్. జామ, పనస, సపోట, నిమ్మ వంటి చెట్లను చూస్తే ఆశ్చర్యపోతాం. శ్రీనివాస్దంపతులు మూడేండ్లుగా టెర్రస్ ఆవరణలోని ఖాళీస్థలంలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. వీటిలో నిత్యం వినియోగించే పాలకూర, చుక్కకూర, బచ్చలికూర, గొంగూర, మెంతి కోతిమీర, పుదీనాలతోపాటు అన్ని రకాల ఆకుకూరలు, టమాట, వంకాయ, బెండ, బీర వంటివి కూరగాయలను పండిస్తున్నారు. వాటితోపాటు జామ, మామిడి, పనస, మునగకాయ, పండ్ల మొక్కలు, మందారం, కనకాంబరాలు, గులాబీ పూల మొక్కలు, అలంకరణ మొక్కలు ఉన్నాయి. మొక్కల పెంపకం కోసం సాధారణ కుండీలతోపాటు వృథాగా ఉన్న టబ్బులు, బకెట్లు ప్రత్యేకంగా తయారు చేయించిన పాలిథిన్ బ్యాగుల్లో మొక్కలు పెంచుతున్నారు. మొక్కలకు శ్రీనివాస్ తన ఇంటిలో ఉత్పత్తయ్యే చెత్తతో సేంద్రియ ఎరువులను తయారుచేసి వాడుతున్నారు. ఇంకా ఆవసరం అయితే సిద్దిపేట స్వచ్ఛబడికి వెళ్లి సేంద్రియ ఎరువులను, ద్రవణాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. బయోచార్ మిశ్రమాన్ని ప్రత్యేకంగా తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. దీంతో ఇటు ఆరోగ్యానికి,అటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతున్నది.
మిద్దె తోటల పెంపకంతో ఆరోగ్యం
మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులు వాడి నాణ్యమైన దిగుబడి పొందుతున్నాం. మిద్దెపై కూరగాయలు పండించడం వల్ల మార్కెట్కు వెళ్లాల్సిన పని తప్పింది. రసాయన అవశేషాలు లేని రుచికరమైన ఆహారం అందుబాటులో ఉంటున్నది. ఆరోగ్యంతోపాటు ఆహ్లాదం లభిస్తున్నది. తోటలో రోజూ పని చేయడం వల్ల వ్యాయామం చేసినట్లు అవుతున్నది. ఇంట్లో ఖాళీస్థలం, మిద్దెలున్న ప్రతిఒక్కరూ ఇంటి పంటలు సాగు చేసుకున్నట్లయితే ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
– శ్రీనివాస్, మిద్దె సాగుదారు