మెదక్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా చాటి చెప్పిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం పోరాడిన ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. “మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కో-కన్వీనర్ గడ్డమీది కృష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు