మెదక్ రూరల్, జనవరి 20: కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య వెలిసిన మల్లికార్జున స్వామి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. కొన్నేళ్ల కిత్రం వెలిసిన మల్లికార్జున స్వామి సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహిస్తారు.
ఆలయ చరిత్ర…
మెదక్ మండలం మంబోజిపల్లి-మాచవరం గ్రామాల శివారులోని కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య గుహలో సుమారు 216 ఏళ్ల కిత్రం శ్రీమల్లికార్జున స్వామి కొలువుదీరాడు. మెదక్ పట్టణానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తికి మల్లన్నస్వామి పూనకంతో గుట్టపైకి ఎక్కి చూస్తే సహజ సిద్ధంగా వెలిసిన నర్సింహస్వామి, మల్లికార్జున స్వామి, నంది విగ్రహాలను రాతిబండపై సహజ సిద్ధంగా వెలిసిన ఆకారాల్ని సాక్షాత్కరించాయట! గుట్టపై కొన్నేళ్ల పాటు పూజలు చేసిన ఆ పూజారి మల్లయ్య గుట్టకింద చిన్నపాటి ఆలయాన్ని నిర్మించి ఆ తరవాత కొద్ది రోజులకు పుట్టమన్నుతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుట్టపై ఉన్న గుహలో పగటి పూట సైతం చిమ్మచీకటి ఉంటుంది. అందులోకి వెలుతురులో వెళ్లాల్సి ఉంటుంది. పూజారి మల్లయ్య వారసులు వంశ పారంపర్యంగా ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఏటా మాఘ అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఉంటుంది. జాతర సమయంలో బోనాలు, అగ్నిగుండాలు, బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
కొయ్యగుట్ట శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణం మహోత్సవం ఈనెల 22 నుంచి 24 తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ వంశపారంపర్య అర్చకులు తెలిపారు. 22 ఆదివారం వేకువజామున నుంచి దిష్టి కుంభం, ఆలయ సంప్రోక్షణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మకలశ స్థాపన, గణపతి పూజ, నవగ్రహ పూజ, గంగా యమున సరస్వతీ పుణ్యనదుల జలాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు, సహస్ర బిల్వార్చన, 12 గంటలకు శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణం, అనంతరం అన్నదానం, సాయంత్రం 5 గంటలకు బండ్ల ప్రదక్షిణ, రాత్రి మల్లన్న స్వామి ఒగ్గుకథ, 23 సోమవారం ఉదయం పంచామృతాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, శివజప యజ్ఞం మహా నివేదన, తీర ప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు అగ్నిగుండం, స్వామివారికి బోనాల సమర్పణ 7 గంటలకు రుద్రాభిషేకం, బిల్వార్చన ఒగ్గు కథలు, 24వ తేదీ మంగళవారం ఉదయం రుద్రాభిషేకం, శ్రీ రేణుకా మాతకు బోనాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి.
కొయ్యగుట్టపై ఆలయాలు…
విశాలమైన విస్తీర్ణంతో కలిగిన కొయ్యగుట్టపై రేణుకా మాత, నందీశ్వరుడు, శబరిమాత, వీర హన్మాన్, నవగ్రహాలు,నాగదేవత, నరసింహస్వామి, భూలక్ష్మీమాత వంటి ఉప ఆలయాలు ఉన్నాయి. మెదక్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సులు ప్రైవేటు వాహనాల సౌకర్యం నిత్యం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నర్సాపూర్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.