ఐనవోలు, జనవరి 12: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ ఆవరణను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
చాళుక్యుల సామంత రాజులుగా ఉన్న కాకతీయులు కాలక్రమంలో స్వతంత్ర రాజులుగా ఓరుగల్లు గడ్డను ఏలిన విషయం తెలిసిందే. రాష్ట్రకూట రాజు కృష్ణ-2 పాలన కాలం క్రీస్తుశకం 850 నుంచి 914 వరకు కొనసాంది. దాదాపు 1100 ఏళ్ల ముందు నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని వెలమ రాజులు పాలించినట్లు శిలాశాసనం చెబుతున్నది. ఇదే సామాజిక వర్గానికి చెందిన మార్నేని వంశస్తులు ఆలయ నిర్వహణ బాధ్యతను కొనసాగించారు. కాలక్రమంలో మార్నేని వంశస్తులు 1966లో దేవాదాయ శాఖకు అప్పగించారు.
సుమారు పది అడుగుల ఎత్తుతో విశాల నేత్రాలు, కోరమీసాలతో చతుర్భుజాలలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పణపాత్రలతో స్వామివారు కనిపిస్తారు. ఇరువైపులా గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి. ఈయన ఇద్దరి భార్యల్లో బలిజమేడలమ్మ కర్ణాకట ప్రాంత వాసి. రెండో భార్య గొల్లకేతమ్మ మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతుంటారు. గొల్లకేతమ్మను మల్లన్న పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మల్లికార్జునస్వామిని వారి ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.
నేడు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారం భం అవుతాయి. 14న భోగి పండుగ, 15న మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, 16న కనుమ, 17న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 14న భ్రమరాంబిక అమ్మవారి దశమ వార్షికోత్సవం, ఫిబ్రవరి 24న ఎల్లమ్మ దేవత పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి.