చేర్యాల, ఫిబ్రవరి 16 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారుల నేతృత్వంలో పంచరంగులతో పెద్దపట్నం వేసి స్వామివారిని స్తుతించారు. శివరాత్రి సందర్భంగా ఆదివా రం లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు మల్లికార్జునస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆల య అర్చకులు రాజగోపుం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించి ఆలయంలోకి తీసుకువెళ్లారు.
అనంతరం ఒగ్గు పూజారులు ఆదివారం రాత్రి 42 వరుసలతో పెద్దపట్నం తయారు చేశారు. స్వామి వారికి బోనం నివేదన అనంతరం, ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకు వచ్చి వేకువజామున పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం దాటారు. ఆ వెంటనే భక్తులు పెద్దపట్నం దాటి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 50 వేలకు మందికి పైగా భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చారు. పెద్దపట్నం చూసేందుకు వచ్చి గ్యాలరీల్లో ఉన్న భక్తులు బారికేడ్లు ఎక్కి పట్నం పైకి దూసుకు వచ్చేందుకు యత్నించగా, పోలీసులు తమ లాఠీలకు పని చెప్పా రు. ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏఈవో రావుల సుదర్శన్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకు లు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు. సిద్దిపేట సీపీ రష్మిపెరుమాల్ బందోబస్తును పర్యవేక్షించారు.