చేర్యాల, డిసెంబర్ 10 : కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఆలయవర్గాలు శుభవార్త. 20ఏండ్ల క్రితం అనివార్య కారణాలతో రద్దు చేసిన పల్లకీసేవను తిరిగి ప్రారంభించేందుకు దేవాదాయశాఖ రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు వసతులు కల్పించేందుకు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్వామి వారి ఆలయ ద్వారాలు, తలుపులకు వెండి తాపడం చేయించిన ఆలయవర్గాలు తాజాగా మల్లన్నకు బంగారు కిరీటం చేయిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, మల్లన్న స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు మల్లన్న దర్శనం, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఇక పల్లకీ మోసి తమ భక్తిని చాటుకునేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి మొదటి వారం నుంచి పల్లకీసేవను మల్లన్న క్షేత్రంలో ప్రారంభించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పల్లకీ సేవను పునరుద్ధరించాలని దేవాదాయ శాఖకు కమిషనర్ నివేదిక పంపగా, సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలిసింది. ఈ సారి బ్రహ్మోత్సవాలకు పల్లకీ సేవ అందుబాటులోకి రానున్నది. ఇక స్వామి వారి క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఉన్న పల్లకీ మోసే అవకాశం కలిగితే భక్తులకు అంతకంటే భాగ్యం ఏముంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పల్లకీ సేవలో పాల్గొనే భక్తులు రూ.500 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
గంగరేగు చెట్టు వద్ద కోడె మొక్కులు
కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణంలోని గంగరేగు చెట్టు వద్ద ఇక నుంచి భక్తులు కోడెతో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయవర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి కమిషనర్ ఆమోదం కోసం ప్రత్యేకంగా నివేదికను సైతం తయారు చేసి ఆలయ అధికారులు ఇటీవల పంపించారు. కమిషనర్ ఆమోదం రాగానే, గంగరేగు చెట్టు వద్ద మొక్కుబడి కోడెలతో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం భక్తులు కోడెను స్వామి వారి రాజగోపురం ఎదురుగా ఉన్న పాత అన్నప్రసాద వితరణ శాల వద్ద మండపం వద్ద కట్టివేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొత్తగా వచ్చే భక్తులకు కోడెను కట్టేసే ప్రదేశం తెలియకపోవడంతో భక్తుల తాకిడితో కొందరు భక్తులు కోడెను కట్టివేయకుండావెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో భక్తులు గంగరేగు చెట్టు ప్రాంగణంలో కోడెలను కట్టివేసి మొక్కులు చెల్లించుకునేలా ఆలయవర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా, మొక్కుబడి కోడెకు రూ.200 టికెట్ను భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కమిషనర్ ఆదేశాలు రాగానే అమలు చేస్తాం
మల్లన్న క్షేత్రంలో పల్లకీసేవను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో పల్లకీసేవ ఉండేది. అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సేవ నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మల్లన్న క్షేత్రంలో పల్లకీసేవ ప్రారంభించనున్నాం. దీనికి రూ.500 టికెట్ నిర్ణయించాలనే యోచనలో ఉన్నాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పులిహోర ధరతో పాటు బరువు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు మల్లన్న ఆలయ ప్రాంగణంలోని గంగరేగు చెట్టు వద్ద కోడెను కట్టివేసి భక్తులు మొక్కులు చెల్లించేలా ఆదేశాలు రాగానే ఏర్పాట్లు చేస్తాం.
– అలూరి బాలాజీ, కొమురవెల్లి ఆలయ ఈవో
పెరగనున్న పులిహోర ధర, బరువు
స్వామి వారి ప్రసాదాల్లో ముఖ్యమైన పులిహోర బరువుతో పాటు ధర పెంచాలని ఆలయ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం 150 గ్రాములున్న పులిహోరకు భక్తులు రూ.15 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇక నుంచి 200 గ్రాములకు పులిహోర బరువును పెంచి రూ.20 ధర నిర్ణయించనున్నారు. నాణ్యమైన, రుచికరమైన పులిహోరను భక్తులు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే ఆలయంలో లడ్డూతో పాటు రవ్వకేసరి సైతం భక్తులకు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ వర్గాలు కమిషనర్ ఆమోదం కోసం నివేదికను రాష్ట్ర దేవాదాయ శాఖకు పంపించారు. ఉన్నతాధికారులు ఆమోదం తెలుపగానే, ఆచరణలోకి రానున్నది.