గత రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి ఊహించని మెజార్టీని సాధించి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2016 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్ 93 వేల ఓట్లతో 53 వేల ఓట్ల మెజార్టీ సాధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్ శెట్కార్కు 37 వేల పై చిలుకు, బీజేపీ తరఫున బరిలో నిలిచిన పట్లోళ్ల సంజీవ్రెడ్డికి 33వేల పై చిలుకు ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి 95వేల ఓట్లతో 58 వేల మెజార్టీ సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014లో ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులతో ప్రజలు సంతృప్తితో ఉన్న సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత కాంగ్రెస్ నేత పట్లోళ్ల కిష్టారెడ్డి మృతితో 2016లో జరిగిన ఉప ఎన్నికతో ఆయా పార్టీల నుంచి వెల్లువలా వచ్చి బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ కోట ధ్వంసమై బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో పటిష్టమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఏడేండ్లలో జరిగిన అభివృద్ధి నారాయణఖేడ్ ప్రాంత రూపురేఖలను మార్చగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక పథకం ప్రతి గడపనూ తట్టిందనడంలో సందేహం లేదు. దశాబ్దాలుగా సాగునీటిపై ఆశలు పెట్టుకున్న ఇక్కడి రైతుల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం వంటివి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూల అంశాలుగా చెప్పవచ్చు.
నారాయణఖేడ్, నవంబర్ 14: పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అనూహ్య కలయికలు ఇటు ఆయా పార్టీల కార్యర్తలను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ సురేశ్ శెట్కార్కు ఖరారు కాగా, ఆయన కాస్త కాడె ఎత్తేసి టికెట్ ఆశించి భంగపడిన పట్లోళ్ల సంజీవ్రెడ్డికి మద్దతు తెలిపి పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం కాస్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం ఒకటైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడిందనే ప్రచారం జరగడం గమనార్హం. అయితే వాదనలు, ప్రచారం ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పరిస్థితి, గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్కు అందనంత ఎత్తులో ఉందనే విషయం అర్థమవుతున్నది. సంస్థాగతంగా బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగిన కారణంగా గత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఏడు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు నియోజకవర్గంలోని 217 పంచాయతీల్లో 90 శాతం మంది బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్లుగా ఎన్నికవడం విశేషం. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్థానంతో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించినప్పటికీ ఎక్స్ ఆఫీషియో విధానం ద్వారా పాలకవర్గస్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకున్నది. ఈ ఎన్నిక కేవలం నారాయణఖేడ్ పట్టణానికి సంబంధించిన అంశమనేది గమనించాల్సిన విషయం.
బీఆర్ఎస్ ఆధిక్యాన్ని అంచనా వేయాలంటే ఒక్క 2018 ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే చాలు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సురేశ్ శెట్కార్కు 37 వేల ఓట్లు రాగా, అప్పట్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ప్రస్తుత బీఆర్ఎస్ నేత మహారెడ్డి విజయపాల్రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ సాధించిన ఓట్లు. ఇదే ఎన్నికల్లో మరో పక్క ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సంజీవ్రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసి సాధించిన ఓట్లు 33 వేలు. ఈ ఎన్నికల్లో బలమైన వర్గంగా ఉన్న విజయపాల్రెడ్డి ఓట్లు కాంగ్రెస్కు కాంగ్రెస్లో బలమైన వర్గంగా పేర్కొంటున్న సంజీవ్రెడ్డి ఓట్లు బీజేపీకి పోలయ్యాయనే విషయాన్ని గమనించాలి. రెండు ప్రధాన పార్టీలు, రెండు ప్రధాన వర్గాలు కలిసి సాధించిన ఓట్లు మొత్తం 70 వేలు. అదే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డికి పోలైన ఓట్లు 95 వేలు. ఈ లెక్కన అందరి ఓట్లు ఒక్కటి చేసినా బీఆర్ఎస్ 25 వేల ఆధిక్యతలో ఉంది. ఇది 2018 ఎన్నికల నాటి పరిస్థితి కాగా, ప్రస్తుత ఎన్నికల్లో మహారెడ్డి విజయపాల్రెడ్డి బీఆర్ఎస్లో చేరి భూపాల్రెడ్డికి మద్దతు ప్రకటిస్తుండగా, అప్పుడు బీజేపీ ఓట్లు సంజీవ్రెడ్డికి పోలవగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా జనవాడే సంగప్ప బరిలో ఉండడంతో ఆ ఓట్లన్నీ సంగప్పకు పోలవడం సహజం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న బలీయమైన శక్తికి విజయపాల్రెడ్డి వర్గం తోడవగా, అప్పట్లో సంజీవ్రెడ్డికి పడిన బీజేపీ ఓట్లు ఇప్పుడు బీజేపీకి పోలయ్యే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్రెడ్డికి ఆ ఓట్లు తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 28 వేల కొత్త ఓట్లు నమోదు కాగా, ఆ ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి లేదా ఒకే అభ్యర్థికి పడే అవకాశం ఉండకపోగా, అన్ని పార్టీలకు ఆ ఓట్లు పోలయ్యే ఆస్కారం ఉందనేది గమనార్హం. ఏడేండ్లలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడుతూ కాంగ్రెస్ను చావు దెబ్బతీస్తుండగా, అన్ని సమీకరణాలు కలగలిసినా బీఆర్ఎస్ బలం ముందు అవన్నీ దిగదుడుపేనని ఎన్నికల ఫలితాలే ధ్రువీకరిస్తున్నాయి. అయినప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం లేని ఊపును కొనితెచ్చుకుని బీఆర్ఎస్కు పోటీ ఇస్తామని ప్రచారం చేయడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
రాజకీయ కారణాలతో విడిపోయిన అన్నదమ్ములు మహారెడ్డి విజయపాల్రెడ్డి, మహారెడ్డి భూపాల్రెడ్డి కలయిక నారాయణఖేడ్ రాజకీయాల్లోనే కీలక పరిణామంగా చెప్పవచ్చు. వీరి తండ్రి దివంగత మహారెడ్డి వెంకట్రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగగా, ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. వెంకట్రెడ్డి అభిమానులు, కార్యకర్తలే తదనంతరం విజయపాల్రెడ్డి, భూపాల్రెడ్డి వర్గాలుగా విడిపోయారు. ఇక విజయపాల్రెడ్డి వర్గం బలం అంచనా వేయాలంటే 2009లో అప్పటికప్పుడు పీఆర్పీ టికెట్పై పోటీ చేయగా 40వేల ఓట్లు రాగా, 2014 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున బరిలో నిలిచిన విజయపాల్రెడ్డికి తిరిగి 40 వేల ఓట్లు పోలవడం విశేషం. ఐదేండ్ల పాటు విజయపాల్రెడ్డి క్యాడర్ చెక్కు చెదరలేదంటే ఆయన వర్గానికున్న నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇద్దరు అన్నదమ్ములు రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ ప్రజల మనుషులుగా సేవలందిస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ తమ క్యాడర్ను పదిలపరుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విజయపాల్రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో మహారెడ్డి భూపాల్రెడ్డికి అదనపు బలంగా తోడ్పతుందనేది నిర్వివాదాంశం. ఇద్దరు ఒక్కతాటిపైకి రావాలని ఏండ్ల తరబడి కోరుకుంటున్న మహారెడ్డి కుటుంబ అభిమానులు, కార్యకర్తలో సోదరులిద్దరి కలయిక నూతనోత్సాహాన్ని నింపగా, బీఆర్ఎస్లో మరింత జోష్ను పెంచిందనేది సుస్పష్టం.