తొగుట, ఏప్రిల్ 2: ‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మొత్తం సీఎం కేసీఆర్ సార్ సస్యశ్యామలం చేసి రామరాజ్యాన్ని తీసుకొచ్చారు..’ అని మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ప్రశంసించారు. మహారాష్ట్రకు చెందిన 120 మంది రైతు ప్రతినిధుల బృందం ఆదివారం మల్లన్నసాగర్ పంప్హౌస్, కట్టను పరిశీలించింది. మండుటెండల్లో మల్లన్నసాగర్లో నీళ్లను చూసి వారు ఖుషీ అయ్యారు. మా ప్రాంతంలో కరువు కాటకాలతో రైతులు అల్లాడుతున్నారని, ఇక్కడ తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
‘ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్, తుమ్ ఆగే బడో, హమ్ తుమారే సాథ్ రహే, కేసీఆర్ జిందాబాద్’ అంటూ మహారాష్ట్ర రైతు ప్రతినిధులు నినాదాలు చేశారు. రైతు సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని రైతు వారు అన్నారు. ఈ సందర్భంగా పంప్హౌస్లో కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ను చూపిస్తూ ప్రాజెక్టు విశేషాలను ఈఎన్సీ హరిరామ్ వారికి వివరించారు. మేడిగడ్డ వద్ద మొదలైన ప్రాజెక్టు 10 పంప్హౌస్ల ద్వారా 420 మీటర్ల ఎత్తు నుంచి వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి తెచ్చినట్లు తెలిపారు. 420 మీటర్ల దిగువన ఉన్న గోదావరి నీళ్లను తెలంగాణకు తరలించడానికే కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, గాయత్రి, అన్నపూర్ణ, ఎమ్మెమ్మార్, అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్ వరకు గోదావరి నీళ్లను తరలించినట్లు వివరించారు. మల్లన్నసాగర్ పంప్హౌస్ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు, కొండపోచమ్మ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు ఈఎస్సీ తెలిపారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి ఎంత ఎత్తుకు గోదావరి నీళ్లను తెచ్చి నిలువ చేయడంపై రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాజెక్టు డెలివరీ చానల్ను పరిశీలించారు. మూడున్నర ఏండ్లలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై వారు ప్రశంసించారు. మల్లన్నసాగర్ నిర్మాణం కోసం 8 గ్రామాలు, 17 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని, 22.6 కిలోమీటర్ల చుట్టూరా మల్లన్నసాగర్ కట్టను నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీళ్లు నిలువ ఉన్నాయని, వచ్చే సంవత్సరంలో 30 టీఎంసీల నీరు నిలువ ఉంచుతామని వారికి ఈఎన్సీ హరిరాం వివరించారు.
కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఈ రిజర్వాయర్ను చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశమంతా పాడిపంటలతో పచ్చగా మారాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని రైతు ప్రతినిధులు కోరారు. పంప్హౌస్లో, మల్లన్నసాగర్ కట్ట మీద సెల్పీలు దిగడానికి రైతు సంఘాల ప్రతినిధులు పోటీపడ్డారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు మానిక్రావు కదం, కిసాన్ సెల్ యూత్ అధ్యక్షుడు సుధీర్ బిందు, నాందేడ్ జిల్లా కిసాన్ సెల్యూత్ అధ్యక్షుడు నవీన్ పాటిల్, ఎమ్మెల్సీ దండె విఠల్, మల్లన్నసాగర్ ఎస్ఈ వేణు, ఈఈలు సాయిబాబా, వెంకటేశ్వర్రావు, డీఈలు శ్రీనివాస్, దయాకర్, రమేశ్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, చిక్కుడు రమేశ్, లింగాల స్వామి పాల్గొన్నారు.