పట్టణ ప్రగతిలో ఉమ్మడి మెదక్ జిల్లా బల్దియాలు ఆదర్శంగా నిలవాలి
జూన్ 3 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం
వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు పూర్తిచేయాలి
ప్రతి బల్దియాలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి
మొక్కలు నాటడం, సంరక్షణలో అలసత్వం వహిస్తే
ఈసారి ఎవరినీ ఉపేక్షించం
ప్రతి ఇంటికీ నిబంధనలతో నల్లా కనెక్షన్ ఇవ్వాలి
అన్ని డ్రైన్లు శుభ్రం చేయాలి..సిల్ట్ తొలిగించాలి
పల్లెలు మారినప్పుడు పట్టణాలు ఎందుకు మారవు..
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
హైదరాబాద్లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పట్టణ ప్రగతిపై సమీక్ష
పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం హైదరాబాద్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాలు చక్కటి రూపును సంతరించుకున్నాయని, ఆ స్థాయిలో మున్సిపాలిటీలు మాత్రం బాగుపడలేదన్నారు. జూన్ 3 నుంచి జరిగే ఈ దఫా పట్టణ ప్రగతిలో అన్ని మున్సిపాలిటీల రూపు రేఖలు మారాలని ఆదేశించారు. వైకుంఠధామాలు, వెజ్ నాన్వెజ్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈసారి నిర్లక్ష్యం వహిస్తే కమిషనర్లతో పాటు చైర్మన్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని డ్రైన్లు శుభ్రం చేసి సిల్ట్ తొలిగించాలన్నారు. పట్టణ ప్రగతి అమలులో ఉమ్మడి మెదక్ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉమ్మడి మెదక్ జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాలు చక్కటి రూపును సంతరించుకున్నాయని అన్నారు. ఆ స్థాయిలో మున్సిపాలిటీలు మాత్రం బాగుపడలేదన్నారు. ఈ దఫా పట్టణ ప్రగతి కార్యక్రమంలో అన్ని మున్సిపాలిటీల రూపురేఖలు మారాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నల్లా కనెక్షన్లు, నీటి పన్నుల వసూలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతి, మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపాలిటీల వారీగా మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. వైకుంఠధామాలు, వెజ్ నాన్వెజ్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలన్నారు. మొక్కలను పెద్ద ఎత్తున పెంచాలని, వాటి సంరక్షణ బాధ్యత మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మొక్కల పెంపకం ఆదర్శంతంగా జరుగుతోందన్నారు. కానీ, పట్టణాల్లో కొంత నిర్లక్ష్యం కనిపిస్తున్నదన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ చేపట్టకపోతే మున్సిపల్ ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలకు ఈసారి వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో రావద్దని మంత్రి హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలను సీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉందన్నారు.
ప్రతి మున్సిపాలిటీలో క్రీడా మైదానం…
ప్రతి మున్సిపాలిటీలో స్థలం సేకరించి స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి హరీశ్రావు సూచించారు. ప్రభుత్వం క్రీడా సామగ్రి సరఫరా చేస్తున్నదన్నారు. ఆరోగ్యవంతులైన తెలంగాణ పౌరులను తయారు చేయాలంటే క్రీడలు ఎంతైనా అవసరం అన్నారు. సీఎం కేసీఆర్ ఇది గమనించి ప్రతి పట్టణం, గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్లపై 3లేదా 4వరుసల్లో మొక్కలు నాటాల న్నారు. అలాంటి రహదారులను కమిషనర్లు గమనించి చక్కగా ప్లాంటేషన్ పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రీన్ ఫండ్ మున్సిపాలిటీల్లో ప్లాంటేషన్ కోసమే ఖర్చు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీల్లో నిబంధనల ప్రకారం ప్రతి ఇంటి కీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నారు. నీటి పన్ను పూర్తిగా వసూలు చేయాలన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో రోజుకో సమయానికి నీటిని వదులుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది సరైన పద్ధ్దతి కాదని, ప్రతిరోజు ఒకే సమయానికి నల్లాల ద్వారా నీటిని వదలాలని సూచించారు. క్రమ పద్ధ్దతిలో నీటిని వదిలేలా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలు, దవాఖానలు శుభ్రంగా ఉంచాలన్నారు. త్వరలోనే మున్సిపాలిటీలకు అవసరమైన సిబ్బంది నియామకాలు జరుగుతాయని తెలిపారు. ఎర్లీబడ్ స్కీంలో భాగంగా ఐదుశాతం రిబెట్తో పన్ను వసూలు చేసి రాష్ట్రంలో జహీరాబాద్ తొలి స్థానంలో నిలవడంపై మున్సిపల్ సిబ్బందిని మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మదన్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీ లు యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టరు హన్మంతరావు, మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టరు ప్రతిమా సింగ్, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో డ్రైన్లు శుభ్రం చేయాలి
పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీల్లోని అన్ని డ్రైన్లు శుభ్రం చేసి, అందులోని సిల్ట్ అంతా తొలిగించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు పారిశుధ్యం విషయంలో భాగా మెరుగుపడ్డాయని, అదే తరహాలో పట్టణాలు మెరుగు పడాలని ఆకాక్షించారు. చెత్త సేకరణలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం ఐదుసార్లు జాతీయ అవార్డు సాధించిందన్నారు. అక్కడ ఐదు రకాలుగా చెత్తను సేకరిస్తున్నారన్నారు. అవసరమైతే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇండోర్ పర్యటనకు పంపిస్తామన్నారు. చాలా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని, త్వరగా పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రగతి తో గ్రామాలు బాగు పడినప్పుడు, పట్టణాలు ఎందుకు బాగుపడవు అన్ని మంత్రి ప్రశ్నించారు. 12,769 గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు అయ్యాయని, అత్యధికంగా చెత్త ఉత్పత్తి అయ్యే మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణాలు జాప్యం జరిగితే ఎలా అని ప్రశ్నించారు. మీరు గట్టిగా పనిచేస్తే పరిశుభ్రమైన పట్టణాలు రూపొందుతాయని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో మంచి స్థలం చూసి బృహత్ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్నారు. మియావాకి ప్లాంటేషన్ చేపట్టాలన్నారు.