మెదక్ అర్బన్, ఫిబ్రవరి 10: కొత్త బైక్ కొనాలనుకుని తల్లి కమ్మల మీద కన్నేసి, నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపిన కుమారుడికి జీవిత ఖైదుతో పాటు రూ.15వేలు జరిమానాను మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద విధించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి నర్సింలుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు బతుకు దెరువు కోసం హైదరాబాద్లో మేస్త్రి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్న కొడుకు మిరుదొడ్డి కుమార్ గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యానికి బానిసై రోజూ గొడవ పడడంతో బాధలు తట్టుకోలేక అతడి భార్య మంజుల పిల్లలను తీసుకుని బొల్లారంలో నివసిస్తున్నది. నార్లాపూర్లో తన తల్లి పోషవ్వ (76)తో కలిసి కుమార్ ఉంటున్నారు.
పోషవ్వను కూడా కుమార్ మద్యం తాగి వచ్చి కొట్టేవాడు. 21మార్చి 2022న రాత్రి సమయంలో పాలివాళ్లకు తన తల్లి నిద్రలో చనిపోయిందని కుమార్ చెప్పాడు. కుటుంబ సభ్యులతో కలిసి పోషవ్వ అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా ఆమె చెవి కమ్మలు కనిపించలేదని, మెడ వద్ద గీరినట్లుగా ఉందని గమనించారు. కుమార్ ప్రవర్తనలో మార్పు కనిపించడంతో అనుమానం వచ్చి కుమార్ను నిలదీశారు. దీంతో తాను కొత్త మోటార్ సైకిల్ కొనడానికి కమ్మలు అడిగితే ఇవ్వకుండా దాచి పెట్టిందని, దీంతో కోపంతో నిద్రపోతున్న తల్లిని గొంతు పిసికి చంపి, కమ్మలు తీసుకున్నట్లు చెప్పాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ నేరాన్ని విచారించి సాక్ష్యాధారాలను కోర్ట్లో నివేదించడంతో, పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద, కుమార్కు జీవిత ఖైదుతో పాటు రూ.15వేల జరిమానా విధించారు. శిక్ష పడేలా వాదించిన పీపీ షేక్ ఫజల్ అహ్మద్, చార్జిషీట్ ఫైల్ చేసిన రామాయంపేట సీఐ చంద్రశేఖర్, కోర్ట్ కానిస్టేబుళ్లకు ఎస్పీ అభినందించారు.