మెదక్ మున్సిపాలిటీ, జూన్ 24: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పుస్తకాలు అందించిన ప్రభుత్వం తాజాగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సైతం గ్రంథాలయాలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో పఠనాశక్తి పెంచడానికి వారు చదివిన పుస్తకం గురించి పది మందికి వివరించేందుకు ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఉన్నత పాఠశాలలకు 120 టైటిళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 74 టైటిళ్లు అందజేసింది.
పుస్తకాలు…
నేషనల్ బుక్ ట్రస్ట్ రూపొందించిన పుస్తకాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉన్నాయి. సాహిత్యం, నాటికలు, కథలు, దేశభక్తుల వీరగాథలు, దేశభక్తికి సంబంధించిన రచనలు ఉన్నాయి. వీటిని నిత్యం చదివితే విజ్ఞానంతో పాటు సామాజిక స్పృహ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు 64 పుస్తకాలు.. 9,10 తరగతుల వారి కోసం 56 పుస్తకాలు ఉంచుతారు. వీటితో పాటు మరో 74 రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
ఒత్తిడికి గురవకుండా..
6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు విద్యాపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. చదువు, పరీక్ష ఫలితాలు, స్థాయి నిర్ధారణ తదితర అంశాల్లో వారికి మానసిక విశ్రాంతి కరువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఊరట కలిగించాలంటే పుస్తక పఠనం ఎంతో ఉత్తమమని నిపుణులు చేసిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రతి రోజూ గ్రంథాలయ సందర్శన, పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయిస్తూ కాలనిర్ణయ పట్టిక తయారు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించింది. వారానికో విద్యార్థి తాను చదివిన పుస్తకం గురించి మిగతా వారికి చెప్పాలి. ఇలా చేయడం ద్వారా భయం పోయి ఏదైనా అంశంపై అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం అలవడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో గ్రంథాలయాలకు ఎంపికైన పాఠశాలలు
జిల్లాలోని 21 మండలాల్లో 152 పాఠశాలలను గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అందులో అల్లాదుర్గం, టేక్మాల్, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, శంకరంపేట(ఆర్), నిజాంపేట, రామాయంపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్, మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో 8 చొప్పున, వెల్దుర్తి మండలంలో 7, రేగోడ్, నార్సింగి, శంకరంపేట(ఎ) మండలాల్లో 7 చొప్పున, చిలిపిచెడ్లో 4, మాసాయిపేట మండలంలో 3 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి.