గజ్వేల్, జనవరి 4 : దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అధికారాన్ని నిర్ణయించేది ప్రజలేనని, ఎవరూ అధికారంలో ఉండాలో ప్రజలు తమ నిర్ణయాధికారాన్ని ఓటు రూపంలో వ్యక్త పరుస్తారని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. గురువారం గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లోని ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో మోహనరాగం సహస్రం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల ఎన్నికల ఖర్చు రూ.8వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు ఖర్చు చేశారన్నారు. ఓటు వేసే ప్రతిఒక్కరూ సమాజం గురించి మరింతగా నెర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అంచెలంచెలుగా అందినంతగా ప్రజాస్వామ్యంలో ఎదగాలన్నారు.
ప్రజాస్వామ్య సంస్కృతి కోసం అందరూ కలిసికట్టుగా నడవాలని, ఉమ్మడి జీవనం కోసం పాటుపడాలన్నారు. సంస్కృతిని గొప్పగా కాపాడుకొవాల్సిన బాధ్యత కళాకారులపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ సంస్కృతి, సాహిత్యాన్ని ఉన్న తరం జీర్ణించుకునేలా మానవ విలువలను తెలియజేయాలన్నారు. శ్రీశ్రీగారు చెప్పిన విషయాలను ఆనాడు ప్రతిఒక్కరూ విశ్వసించారన్నారు. ప్రతిభను వెలికితీసే విధంగా సమాజంలో అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి కల్పించే జన్యు సంపదను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో సినీ నిర్మాత నర్సింగరావు, లోక్సత్తా ఉభయ రాష్ర్టాల కన్వీనర్ బండారు రామ్మోహన్రావు పాల్గొన్నారు.