సీతాఫలం అంటే నోరూరని వారెవరూ ఉండరు. సీజనల్గా లభించే ఈ పండ్లను తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం సీజన్ కావడంతో అంతటా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా గౌరారం అడ్డా సీతాఫలాల విక్రయాలకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి నిత్యం వందల బాక్సులు ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్ చేస్తున్నారు. సీతాఫలాల సేకరణ, విక్రయాలతో అనేక మంది ఉపాధి పొందుతున్నారు.
గజ్వేల్, అక్టోబర్ 29 : వర్గల్ మండలం గౌరారంలో రాజీవ్ రహదారి పక్కన గల కొండపోచమ్మ సాగర్ సంగారెడ్డి కెనాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సీతాఫలాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏటా సీజన్ ప్రారంభం నుంచి రైతులు, రైతు కూలీలు గ్రామాల్లో సీతాఫలాలను సేకరించి గౌరారంలోని అడ్డా వద్దకు చేరుకుంటారు. ఇక్కడ కాయల నాణ్యతను బట్టి వ్యాపారులు బాక్స్కు రూ.600 నుంచి రూ.1200 వరకు ధరను చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. స్థానికంగా రోడ్డు పక్కన పండ్లు విక్రయించే వారు పెద్దకాయలను రూ.500కు డజను వరకు విక్రయిస్తుంటారు. గజ్వేల్, వర్గల్, మర్కూక్, ములుగు మండలాలకు చెందిన రైతులు, రైతు కూలీలు వివిధ ప్రాంతాల్లో సేకరించిన కాయలతో ఉదయం 8గంటల నుంచి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడికి ట్రాలీ ఆటోలతో వ్యాపారులు వచ్చి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్లోని మార్కె ట్, సూపర్మార్కెట్లకు తరలించి విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో నాణ్యమైన సీతాఫలాలు లభిస్తుండడంతో ప్రయాణికులు తప్పనిసరిగా ఆగి మరీ కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇంటికి వెళ్లినా, బంధువుల ఇండ్లకు వెళ్లినా సీతాఫలాలు తీసుకెళ్తుంటారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి తదితర జిల్లాల ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించినప్పుడు ఆగి మరీ కొనుగోలు చేస్తుంటారు.
ఒకప్పుడు…
ఒకప్పుడు రైతులు, రైతు కూలీలు సీతాఫలాలు సేకరించి గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ విక్రయించేవారు. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. సీతాఫలాల్లో యాంటీ యాక్సిడెంట్లు, పీచు పదార్థాలు, ఎక్కువ మోతాదులో పోషకాలు, వ్యాధులను తగ్గించే గుణం ఉండడంతో మందులను సేవించే బదులు మంచి పండ్లను తినడంతో ఆరోగ్యాన్ని పొందాలన్న ఆలోచన ప్రజల్లో పెరిగిపోయింది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడంతో పండ్లకు డిమాండ్ పెరిగింది. రైతులు, రైతు కూలీలు పట్టణాల్లో, గ్రామాల్లో తిరుగుతూ విక్రయించడంతో ప్రస్తుత పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో గౌరారం అడ్డా వద్దే సీతాఫలాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో రైతులు, కూలీలకు మంచి గిట్టుబాటు అవుతున్నది.
రోజూ వంద బాక్సులకు పైనే అమ్మకం..
గౌరారం అడ్డా వద్ద సీజన్లో సీతాఫలాల అమ్మకాలు బాగా జరుగుతుంటాయి. ఏటా వర్గల్, మర్కూక్, ములుగు, గజ్వేల్, జగదేవ్పూర్ ప్రాంతాలకు చెందిన రైతులు తాము సాగుచేసిన సీతాఫలాలను, అలాగే కూలీలు కూడా తాము సేకరించిన కాయలను గౌరారం అడ్డాకు తెస్తారు. ఇక్కడ సీజన్లో రోజు వందకు పైగా బాక్సుల్లో సీతాఫలాలు విక్రయిస్తుంటారు. వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. దీంతో మాకు ఆదాయం సమకూరుతున్నది.
– తిరుపతి యాదవ్, తైబజార్ కాంట్రాక్టర్
కూలి గిట్టుబాటు అవుతుంది..
రోజంతా పనికి వెళ్లే బదులు చిప్పల పండ్ల సీజన్లో కాయలు వెతికి చెట్ల నుంచి తెంపుకొచ్చి ఇక్కడ అమ్మితే రోజు కూలి పడుతుంది. బాక్సు నిండా మంచి కాయ లు తీసుకువస్తే రూ.700 వరకు వస్తాయి. అమ్మినంక ఇంటికి పోయి ఇంటి పనులు చేసుకుంటాం. లేకపోతే పొలం పనులు ఉంటే పోతాం. సీజన్ ఉన్నన్ని రోజులు మంచిగ పైస లు వస్తాయి.
-శ్యామల, కూలీ