సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 2 : కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేసి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమెల మాణిక్ మాట్లాడుతూ దళితుల జనాభా ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించి, పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరోసారి దళితులను మోసం చేసిందని, బడ్జెట్లో న్యాయ సాధికారతకు కేటాయింపులు తగ్గించడమే నిదర్శనమన్నారు. గతేడాది రూ.1819.52 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.976.85 కోట్లకు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా దళితులపైన దాడులు, హత్యలు జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దళిత ద్రోహిగా మారిందని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలోని పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్ట పరిచే విధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పి.అశోక్, ఉపాధ్యక్షుడు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు దాస్, దత్తు, డీబీఎఫ్ నాయకురాలు లక్ష్మి, ఆయా సంఘాల నాయకులు బస్వరాజ్, శివకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.