చేగుంట, జూన్ 22: వర్షాకాలంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా చోట్ల స్తంభాలు విరిగి, లైన్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏరడిందన్నారు. ముందస్తు మరమ్మతులు చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని, ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, శానిటైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడే అవకాశం ఉందన్నారు.
వైద్యాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పా టు చేయాలన్నారు. పాము, కుక్కకాటుకు అవసరమయ్యే ఇంజక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు,ఇతర మౌలిక సదుపాయాల పనులు నాణ్యతతో పూర్తి చేయాలని పంచాయత్రాజ్ అధికారులకు సూచించారు. చేగుంట, నార్సింగి, రామాయంపేటకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాలకు ఇటీవల జంతువులు వస్తున్నాయని, అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐసీడీఎస్ అధికారులు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను మెరుగుపర్చాలన్నారు.
రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. చెరువులు,కాల్వలు కబ్జాలు కాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా ఐసీడీఎస్ అధికారి, మండల ప్రత్యేకాధికారి హేమభార్గవి,ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ బాల్లక్ష్మి, డీఆర్డీఏ సీహెచ్ శ్రీనివాస్రావు, జిల్లా పంచాయతీ అధికారి యాద య్య, పంచాయత్రాజ్ ఈఈ నర్సింహులు, హౌసింగ్ పీడీ మాణి క్యం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.