చేర్యాల, జూలై 23 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి తలనీలాల సేకరణ హక్కుల టెండరు ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. నెలాఖరు వరకు టెండరుదారులు ఆన్లైన్లో టెండరు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న ఆన్లైన్ టెండర్ను ఖరారు చేయనున్నారు. ఇప్పటి వరకు ఆలయంలో నిర్వహిస్తున్న సీల్డ్ టెండరు కమ్ బహిరంగ వేలం మూడుసార్లు వాయిదా పడింది. టెండరుదారులు సిండికేట్గా ఏర్పడడంతో స్వామి వారి ఖజానాకు ఆదాయం రావడం లేదని ఆలయ అధికారులు, పాలక మండలి గుర్తించింది. గతేడాది ఆలయంలో నిర్వహించిన సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంలో రెండు సంస్థలు పోటీ పడడంతో రూ. 84 లక్షల ఆదాయం వచ్చింది. గతంలో ఇదే టెండరు రూ. 47 లక్షలు ఉండగా, వెంట్రుకల వ్యాపారం చేసే రెండు కంపెనీలకు చెందిన సభ్యులు పోటీ పడడంతో ఒక్కసారిగా రూ. 37 లక్షల ఆదాయం స్వామి వారి ఖజానాకు లభించింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది మూడుసార్లు నిర్వహించిన టెండరులో రూ.50లక్షల నుంచి మొదలుకొని రూ. 56 లక్షల వరకు వచ్చి నిలిచిపోతున్నది. టెండరుదారుల మధ్య పోటీ లేకపోవడంతో స్వామివారి ఆదాయానికి గండిపడే అవకాశం ఏర్పడింది. ఒకే సంస్థకు చెందిన వ్యక్తులు టెండరులో పాల్గొనడం, ఆదాయం రాకపోవడంతో ఈ సంవత్సరం ఆన్లైన్ టెండర్కు ఆలయవర్గాలు శ్రీకారం చుట్టాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొబ్బరికాయ సమర్పించుకుంటారు. భక్తులు సెంటిమెంట్ను ఆసరాగా తీసుకొని కొబ్బరికాయల టెండరుదారులు తక్కువ ధరకు టెండరు దక్కించుకొని అధిక ధరలకు టెంకాయిలు విక్రయిస్తున్నారు. దీనిని గుర్తించిన ఆలయ పాలకమండలి ఈసారి నిర్వహించిన టెండర్లలో కొబ్బరికాయల విక్ర య టెండర్ను రద్దు చేసింది. కొబ్బరికాయల టెండరు రద్దు చేయడంతో ఆలయానికి ఆదాయం పడిపోతుందనే కారణంతో సదరు టెండరులో కొన్ని మార్పులు, చేర్పు లు చేసింది. కొబ్బరికాయల టెండరు నిర్వహిస్తూనే కొన్ని మార్పులు చేసింది. గతంలో కొబ్బరికాయల టెండరుదారుడు ఆలయ రాజగోపురం వద్ద కొబ్బరి కాయల షాపు ఏర్పాటు చేసుకొని భక్తులకు విక్రయించే వారు. ఈ ఏడాది నుంచి మల్లన్న క్షేత్రంలో నాలుగు షాపులు ఏర్పాటు చేసి సదరు షాపులకు టెండరు నిర్వహించే ప్రక్రియను చేపట్టారు. ఇందులో నూతనంగా నిర్మిస్తున్న క్యూలైన్ సమీపంలోని వేపచెట్టు వద్ద ఒక షాపు, వైశ్య సత్రం వద్ద ఒక షాపు, ఆలయ యూ ఆకారం బిల్డింగ్ వద్ద మరోషాపు, రెడ్డి హోటల్ ఎదురుగా మరోషాపు ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి టెండరుదారులు షాపుల వారీగా పాటను పాడి షాపును దక్కించుకోవాల్సి ఉంటుంది. గతేడాది రూ. 33 లక్షలున్న టెండరు నాలుగు షాపులు ఏర్పాటు చేయడంతో ఎక్కువ ఆదాయం రానున్నది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని, భక్తులకు వసతులు చేకూరుతున్నాయని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన ఎంపీకి ఆలయవర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అర్చకులు ఎంపీకి స్వామి వారి శేషవస్ర్తాలతో పాటు తీర్థ్ధప్రసాదాలు, ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఆలూరి బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, పాలక మండలి సభ్యురాలు నామిరెడ్డి సౌజన్య, ఆలయ వర్గాలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.