చేర్యాల, మార్చి 31 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం నుంచే మల్లన్న క్షేత్రానికి భక్తులు రాక ప్రారంభమైంది. ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేరులో స్నానాల అనంతరం స్వామిని దర్శించుకున్నారు. సాధారణ దర్శనం నాలుగున్నర గంటలు, ప్రత్యేక దర్శనం మూడున్నర గంటలు పట్టింది. భక్తులు పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.బోనాలు తీశారు.గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. సంతానం కలగాలని మరికొందరు ఒల్లుబండ పూజలు చేశారు. రాతిగీరల వద్ద మొక్కులు, కోడె ను కట్టి స్వామిని వేడుకున్నారు.
ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు. అడిషనల్ డీసీ పీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలోని తంగెడపల్లికి చెందిన గడ్డం దేవయ్య(భీవండి) రూ.50,116 విరాళం అన్నదాన సత్రానికి అందజేశారు. ఆలయ ఈవో ఎ.బాలాజీకి ఆయన నగదు అందజేసి రసీదును పొందారు.కార్యక్రమంలో ఆలయ సిబ్బంది నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.