చేర్యాల, మార్చి 8: మహా శివరాత్రిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం వీక్షించేందుకు, మహా శివరాత్రి జాగరణ చేసేందుకు వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర పాత జిల్లాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. శుక్రవారం సాయంత్రం నుంచే భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి, బిగ్బాస్ విన్నర్ పల్లవీప్రశాంత్ వారి కుటుంబసభ్యులతో కలిసి మల్లన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయవర్గాలు ఘన స్వాగతం పలికాయి.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ జాము 4గంటల వరకు 155 మంది ఒగ్గు పూజారులు భక్తిశ్రద్ధలతో పెద్దపట్నం నిర్వహించారు. ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీలశేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు విధులు నిర్వర్తించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీను, చేర్యాల, కొమురవెల్లి ఎస్సైలు దామోదర్, నాగరాజు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.