చేర్యాల, ఫిబ్రవరి 26: సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం తరలివచ్చింది. భక్త జనులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల 6వ ఆదివారం సందర్భంగా పూర్వపు కరీంనగర్, వరంగల్తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి 50వేల మందికి పైగా భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ తెలిపారు.
కొమురవెల్లి ఆలయం వద్ద అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భాస్కర్రెడ్డి, చంద్రమోహన్, నారాయణ, నరేందర్రెడ్డి, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించారు.
ఆలయ సిబ్బంది సేవలు..
ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు నీలశేఖర్, శ్రీనివాస్శర్మ, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ డైరెక్టర్లు కొంగరి గిరిధర్, నర్ర రఘువీర్రెడ్డి, సూటిపల్లి బుచ్చిరెడ్డి, పచ్చిమడ్ల సిద్ధిరాములు, కాసర్ల కనకరాజు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు భక్తులకు సేవలం దించారు. ఆలయ వర్గాలు ప్రసాదాలు విక్రయాలు చేశాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
గంటల పాటు నిలిచి.. స్వామివారిని దర్శించి…
ఆదివారం వేకువజాము నుంచే కోనేరులో భక్తులు స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు అభిషేకాలు,అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి, పట్నాలు వేసి, ఒడిబియ్యం పోసి, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలు తయారుచేసి కొండపైన ఉన్న ఎల్లమ్మకు సమర్పించారు. భక్తులు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి తమ కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. బోనాలు.. డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. బండారితో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి.