కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. పట్నం వారాన్ని పురస్కరించుకొని జనం పోటెత్తారు. సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించారు.
పసుపుమయమైన కొమురవెల్లి క్షేత్రం
భక్తిశ్రద్ధలతో పెద్ద పట్నం, అగ్నిగుండాలు
కోరమీసాల సామికి కోటి మొక్కులు చెల్లించుకున్న జనం
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
పసుపు ధూళిలో మెరిసి..మల్లన్న సేవలో మురిసి..
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. పట్నం వారాన్ని పురస్కరించుకొని జనం పోటెత్తారు. సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించారు. భక్తులు పంచవర్ణాల పెద్దపట్నం దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేశారు. మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు భక్తులు పసుపును ఒకరిపై ఒకరు చల్లుకొని తన్మయత్వం పొందారు. మహిళలు నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
– చేర్యాల, జనవరి 23
పుసుపు ధూళిలో తనువు
మెరిసిపోయిన వేళ మల్లన్న సేవలో మనసు మురిసిపోయింది. పట్నం వారం సందర్భంగా కొమురెల్లి క్షేత్రం పసుపు వర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచ వర్ణాల పెద్దపట్నాన్ని దాటుకుంటూ, పంచ పల్లవాల అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకొని భక్తి తన్మయత్వం పొందిన హృదయాలెన్నో! కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
– చేర్యాల, జనవరి 23
స్వామి సేవలో హైదరాబాద్ యాదవ సంఘం
హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయవర్గాల సహకారంతో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, పాలక మండలి సభ్యులు కొంగరి గిరిధర్, సూటిపల్లి బుచ్చిరెడ్డి, నర్ర రఘువీరారెడ్డి, కందుకూరి సిద్దిలింగం, పచ్చిమడ్ల సిద్దిరాములు, గడ్డం మహేశ్ యాదవ్, సాయి యాదవ్, కాసర్ల కనకరాజు, చెట్కూరి తిరుపతి, నామిరెడ్డి సౌజన్య, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్ శర్మ, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
ఒళ్లంతా బండారు.. మనసంతా మల్లన్న…
భక్తులు పసుపును ఒళ్లంతా పూసుకోవడంతోపాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. బండారును ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మల్లన్నపై భక్తిప్రపత్తులను చాటారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొనేందుకు భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. ఆయన సోమవారం పోలీసు బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పెద్దపట్నం, అగ్నిగుండాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు, పాలక మండలి, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో స్వామివారి కార్యక్రమాలను విజయవంతం చేశామన్నారు. సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, ఎస్బీ ఏసీపీ రవీందర్ రాజు, ఇన్స్పెక్టర్ రఘుపతి, చేర్యాల సీఐ శ్రీనివాస్, హుస్నాబాద్ సీఐ కిరణ్, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్, కోహెడ ఎస్సై నరేందర్రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ కెడెట్లు బందోబస్తులో పాల్గొన్నారు.
దర్శనం.. భక్తిపారవశ్యం…
అనంతరం పెద్దపట్నం, అగ్నిగుండాలను అర్చకులు దాటిన వెంటనే భక్తులు పట్నం, అగ్నిగుండాలను దాటుకుంటూ ఆలయంలో మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం శివసత్తులు, ఘనాచార్యులకు ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ఈవో బాలాజీ, పాలకమండలి సభ్యులు కండు వా, జాకెట్ ముక్కలతోపాటు స్వామివారి బండారి పంపిణీ చేశారు.
పట్నం వారం మల్లన్న ఆదాయం 40,98,218
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం సందర్భంగా రూ.40,98,218 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి వెల్లడించారు. ఈ విషయమై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితరాల ద్వారా శనివారం రూ.10,02,136 రాగా, ఆదివారం రూ.30,96,082 ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం పట్నం వారానికి రూ.36,01,730 స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
పంచవర్ణాల పెద్దపట్నం.. పంచ పల్లవాల అగ్నిగుండం..
ఒగ్గు పూజారులు పంచవర్ణాలు (తెలుపు, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ) రంగు గల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలు (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలు పేర్చి అగ్నిగుండం తయారు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలను దాటే కార్యక్రమం అద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. పెద్దపట్నం చూసిన భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం ధూళిదర్శనం, ఆదివారం బోనాలు, పట్నాలు, సోమవారం పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ క్రమంలో పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.