‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి, కోరమీసాల స్వామి కోటిదండాలు’ అంటూ భక్తుల శరణుఘోషతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం లష్కర్ వారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచే మల్లన్న దర్శన భాగ్యాన్ని ఆలయ వర్గాలు కల్పించాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేసి, పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
చేర్యాల, జనవరి 29: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో ఆదివారం లష్కర్వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. లష్కర్ వారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
వేకువజాము నుంచే క్యూలైన్లు కిటకిట..
శనివారం సాయంత్రం నుంచే భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వేకువజాము నుంచే కోనేటి పరిసరాలు, దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. భక్తుల రద్దీ కనిపించడంతో ఉదయం ఐదు గంటల నుంచే దర్శనానికి అనుమతించారు. ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం, ధర్మదర్శనం తదితర కౌంటర్లను తెరిచి భక్తులకు టిక్కెట్లను విక్రయించారు.
40 వేల మంది దర్శనం…
మల్లన్న దర్శనానికి 40 వేల మంది తరలివచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పలువురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.
మల్లన్న మొక్కులు.. తీరొక్క పూజలు…
భక్తులు గంటల పాటు క్యూలైన్లలో వేచి మల్లన్నను దర్శించుకున్నారు. అభిషేకం, అర్చన, ఒడిబియ్యం, కొబ్బరి కాయలు, పట్నాలు, బోనాలు తదితరాల రూపంలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గుట్టపై ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు సమర్పించారు.