చేర్యాల, మార్చి 3: వేలాదిగా భక్తులు తరలిరావడంతో సిద్దిపేట జిల్లాలోని కొమురవల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారానికి కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర పాత జిల్లాల నుంచి 25వేల మంది భక్తులు తరలివచ్చారు. ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు భారీగా రావడంతో పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి.
శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాకా ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి, స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది భక్తులకు సేవలందించారు. ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం ఉండడంతో ఆలయం వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు.
భక్తులకు తప్పని కరెంటు తిప్పలు…
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఆదివారం వేకువజామున చిమ్మచీకట్లో మగ్గారు. ఉదయం 5గంటలకు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో క్యూలైన్లు, గర్భగుడి, గంగరేగు చెట్టు తదితర ప్రదేశాల్లో చీకటి అలుముకున్నది. దీంతో భక్తులు ఇబ్బందికి గురయ్యారు. 15 నిమిషాల పాటు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కరెంట్ పోతే ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యే ఆధునిక టెక్నాలజీ కలిగిన జనరేటర్, దాని నిర్వహణ కోసం ఆలయ ఉద్యోగి, ఇద్దరు వలంటీర్లు ఉన్నప్పటికీ మల్లన్న భక్తులు చిమ్మ చీకట్లో మగ్గడం తప్పలేదు.