చేర్యాల, ఫిబ్రవరి 11: కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడం, పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు. మహా మండపం, గంగరేగు చెట్టు ఆవరణతోపాటు తాము బస చేసిన గదుల వద్ద పట్నాలు వేయనున్నారు. మరికొందరు భక్తులు మల్లన్న గుట్టపై ఎల్లమ్మకు బోనం చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు.
మల్లన్న క్షేత్రంలో మొక్కుల అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు తరలివెళ్లి అక్కడ బోనాలు, మొక్కులు చెల్లించుకోనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం రూ.కోటి దాటింది. మరిన్ని వారాలు మిగిలి ఉండడంతో హుండీ ఆదాయంతోపాటు ఆర్జిత సేవల ద్వారా అధికంగా ఆదాయం రానున్నది. భక్తుల కోసం ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ తదితరులు పలు వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు.