కోహీర్, డిసెంబర్ 6: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, మనియార్పల్లి గ్రా మాల్లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించింది. ఆ సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. మెలకువ ఉన్న వారు మాత్రం భూమి కంపించిందని గుర్తించారు. బిలాల్పూర్ గ్రామంలో మల్లికార్జునస్వామి జాతర పురస్కరించుకొని ఆలయ ఆవరణలో వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో గ్రామంలో చాలామంది మేల్కొని ఉన్నారు. నాటక ప్రదర్శన వద్ద ఉన్నవారికి మైక్ ద్వారా పాటలు, మాటలు వినిపిస్తుండడంతో భూమి కంపించింది పసిగట్టలేక పోయారు. కొద్ది దూరంలో ఉన్న వారు మా త్రం భూమి కంపించినట్లు గుర్తించారు. ఇనుప రేకుల నుంచి శబ్ధం రావడంతో జనం బయటకు పరుగులు తీశారు. ఉదయం 3.20గంటలకు మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూమి కంపిస్తే, తెల్లారిన తర్వాత కూడా చాలామంది భయంతో ఇండ్లలోకి వెళ్లలేదు. ఎలాంటి నష్టం జరగలేదు. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యా రు. తమ గ్రామాల్లో భూమి కంపించిందని గ్రామస్తులు తహసీల్దార్ విజయ్కుమార్కు సమాచారం అందించారు. మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. పది నెలల క్రితం బిలాల్పూర్, మనియార్పల్లి, బడంపేట, గొటిగార్పల్లి గ్రామాల్లో ఇలాగే భూమి కంపించింది. మళ్లీ మళ్లీ భూప్రకంపనలు వస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నదోనని చర్చించుకొంటున్నారు.
పెద్ద సౌండ్ వచ్చింది..
మా గ్రామంలో ఉదయం 3.20గంటల ప్రాంతంలో పెద్ద సౌండ్ వచ్చిం ది. ఒక్కసారిగా భ యం వేసింది. ఏమి జరిగిందో అప్పుడు నాకు కూడా తెలియదు. కానీ, తర్వాత అర్థం అయ్యింది. అది భూకంపం రావడంతోనే సౌండ్ వచ్చిందని తెలిసింది.
-బొడిసేపల్లి శంకరప్ప, బిలాల్పూర్
ఎవరికీ ఏమీ కాలేదు..
మనియార్పల్లిలో భూమి కంపించింది. ఇంతకుముందు కూడా ఇలాగే చోటుచేసుకుంది, అప్పుడు కూడా ఎలాంటి నష్టం కాలేదు. ఇప్పు డు కూడా ఎవరికీ ఏమీ కాలేదు. భూమి కంపించినప్పుడు భయం వేసింది. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకపోవడంతో గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారు.
-సత్యనారాయణరెడ్డి, మనియార్పల్లి