చౌటకూర్, ఏప్రిల్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్టుకార్డు ఉద్యమం చేపడుతామన్నారు. ఈనెల 16న సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ శివారులో సింగూరు చౌరస్తా వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేలోపు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డులు రాయాలని, ఈ విషయంలో గ్రామా ల్లో రైతులకు పార్టీ కార్యకర్తలు సహకరించాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాల వద్దనే రూ.1600, రూ. 1700లకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సీఎం రేవంత్ ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. కాంగ్రె స్, బీజేపీలు దొందు దొందేనని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండకూదన్న కుట్రలు చేస్తున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే ఢిల్లీలో జై తెలంగాణ అనేవారు లేకుండా పోతారన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల అభివృద్ధి, ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. నాణ్యమైన విద్యుత్ను 24 గంటల పాటు సరఫరా చేసి వ్యవసాయా న్ని పండుగలా మార్చామన్నారు. కేంద్రంలో బీజేపీ పదేండ్ల పాలన, కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభల పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువత తరలివచ్చి కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల జైపాల్రెడ్డి, ఎంపీపీ వైస్ ఎంపీపీ గాజుల వీరేందర్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె సంజీవయ్య, బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం, నారాయణ, డీబీ నాగభూషణం, వెంకటేశం, శివకుమార్, విజయ్కుమార్, మల్లారెడ్డి, మాణిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.