సిద్దిపేట, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలనే దశాబ్దాల కలను, రైల్వేలైన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే సాకారమైనట్లు మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ…మెదక్ జిల్లా కేంద్రంగా మారుస్తామని, రైలు తెస్తానని ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ హామీ ఇచ్చి నెరవేర్చలేదని, కానీ.. ఆ హామీలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. మెదక్ జిల్లాను ఏర్పాటు చేసి సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నిర్మించుకున్నట్లు చెప్పారు. మెదక్కు రైలు తెచ్చామని, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. మంజీరా హల్దీ వాగుల మీద చెక్డ్యామ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు, వంతెనలు, అనేక అభివృద్ధి పనులు చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక జిల్లా కేంద్రం మెదక్ రూపురేఖలు మారిపోయాయన్నారు. ఇది మెదకేనా అన్నట్లుగా అభివృద్ధి జగిందన్నారు. మెదక్ జిల్లాలో తెలంగాణ వచ్చినప్పుడు 1.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, ఇప్పుడు 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితోనే ఇవన్నీ సాధ్యమైనట్లు తెలిపారు. ఒకనాడు అన్నం పెట్టిన మెతుకు సీమ సమైక్య పాలనలో దుర్భిక్షానికి నెలవుగా మారిందన్నారు. ఇప్పుడు జిల్లా ఇతర రాష్ర్టాలకు అన్నం పెట్టేంతగా వ్యవసాయంలో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఎండకాలంలో తూప్రాన్ వద్ద హల్దీవాగు చెక్డ్యామ్ల్లో నీళ్లు మత్తళ్లు దుంకుతాయని, మంజీరాకు గోదావరి జలాలు వస్తాయని కలలో కూడా అనుకోలేని పనులు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. ఈసారి అందరం సమష్టిగా పనిచేసి 10కి 10సీట్లు గెలిపించి సీఎం కేసీఆర్ కానుకగా ఇద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు తెచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసి చూపించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్నారు. ఎండకాలంలో పంటలు ఎండిపోతున్నాయని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి అడిగితే, ముఖ్యమంత్రి కాళేశ్వరం గేట్లు ఎత్తి హల్దీ నుంచి మంజీరాకు నీటిని పంపి పంటలకు ఇచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదా అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
సీఎం సభ సక్సెస్
సీఎం పర్యటన సందర్భంగా మెదక్ పట్టణం గులాబీమయమైంది అడుగడుగా గులాబీ జెండాలు, తోరణాలు, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు, బెలున్లూ ఏర్పాటు చేయడంతో ఎక్కడ చూసినా పట్టణమంతా గులాబీ వాతావరణం నెలకొన్నది. మెదక్ పట్టణం చేరుకోగానే ప్రధాన కూడల్లో సీఎం వాహనంపై జనాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. సభకు జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున, తండోపతండలుగా తరలి రావడంతో బహిరంగ సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.
కుల సంఘాల ర్యాలీలు
తరలి వచ్చిన ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో సభ ప్రాంగాణాల వరకు డోల్ దెబ్బలతో, డప్పు చప్పుళ్లతో బీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలతో సభస్థలికి చేరుకున్నారు. సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ నినాదాలు చేశారు.