కరీంనగర్/రాజన్నసిరిసిల్ల /పెద్దపల్లి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు వచ్చేసింది. బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతోంది. రైతుల సెల్ ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారుల వద్ద 1,79,957 మంది రైతుల వివరాలు ఉన్నా యి. వీరికి రూ.175 కోట్ల 38 లక్షల 44 వేల 965 మంజూరయ్యాయి. అయితే ఇందులో 1,79,605 మంది వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు అప్డేట్ చేశారు. ఇందులో 1,79,549 మంది రైతుల వివరాలను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కాగా మొదటి రోజు ఎకరంలోపు ఉన్న రైతుల్లో 70,430 మంది వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులు ట్రెజరీకి పంపించారు. ఈ రైతులకు సంబంధించి రూ.19కోట్ల 8 లక్షల 6 వేల 816 మంజూరు చేశారు. దీంతో రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతున్నట్లు వారి సెల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందుతోంది.
పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారుల వద్ద 1,51,805 మంది రైతుల వివరాలు ఉన్నాయి. వీరికి రూ.139 కోట్ల 85లక్షల 37వేల 810 మం జూరయ్యాయి. వీరందరి వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు అప్డేట్ చేశారు. మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కాగా మొదటి రోజు ఎకరంలోపు ఉన్న రైతుల్లో 91,938మంది వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులు ట్రెజరీకి పంపించారు. వీరికి సంబంధించి రూ.43.09కోట్లు మంజూ రు చేయ గా, రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 128361 మంది రైతులుండగా, అందులో 119291 మంది కి రూ. రూ. 125,98,37,444 కోట్లను బుధవారం బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. ఖా తాలో జమ అయిన వెంటనే సెల్ఫోన్లకు మెసేజ్ రావడంతో చూసుకుని మురిసి పోయారు. మిగి లిన 9070 మందికి ఖాతాలో జమకానున్నాయి.
యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం ఖా తాల్లో జమవుతున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరంలోపు ఉన్న రైతులకు ముందుగా రైతుబంధు ఇస్తున్నారు. అనంతరం రెండెకరాల్లోపు, తర్వాత మూడెకరాల్లోపు ఉన్న రైతులకు ఖాతాల్లో నగదును రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. ఖాతాల్లో నగదు జమైన రైతులకు సీఎం కార్యాలయం నుంచి కూడా మెస్సేజ్ వస్తోంది. ఇటు బ్యాంకుల నుంచి మెస్సేజ్లు వస్తున్నాయి. ఈ నగదును రైతులు పంట పెట్టుబడికి ఉపయోగించుకోవాలని సీఎం సందేశాలు పంపుతున్నారు. జిల్లాలోని రైతులు ఈ మెస్సేజ్లు చూసుకుని మొదటి రోజు చాలా మంది నగదు విడిపించుకున్నారు.
కేసీఆర్ సారు రైతుబంధు వెట్టినప్పటి నుంచి ప్రతీ పసలుకు నాట్లేసే టైంకు ఖాతాల పైసలు వడుతన్నయి. నాకు ఎకురం భూమి ఉన్నది. పెట్టువళ్లకు ఓ అయ్యదగ్గరికి పోయి పైసలు అడుగక తప్పక పోయేటిది. నాట్లకు, ట్రాక్టర్ దున్నుడుకు, పిండిబత్తాలకు, ఏదో ఒకదానికి తక్కువ వడేది. ఇప్పుడు ఆ రందిలేదు. దున్నుళ్లు మొదలు వెట్టగానే సెల్కు మెస్సేజ్ అత్తంది. బ్యాంక్కు వోయి పైసలు దెచ్చుకొని ఎవ్వల దగ్గర చెయ్యిజాపకుండా ఉన్న నాటేసుకుంటన్న. ట్రాక్టర్ దున్నుళ్లకు పైసలు సక్కగ ఇయ్యరని వాళ్ల సుట్టు ఎన్ని సార్ల దిరిగినా రాకపోయేది. బతిలాడి తీసుకచ్చుకునేది. ఇప్పుడైతే రైతుబంధు పైసలత్తన్నయని ఎట్లయినా ఇత్తరని అడుగక ముందే మందలిచ్చి దున్నిపోతుర్రు. పండుగ కన్న ఓ సారి సేతుల పైసలుంటయో లేదో తెల్వదుగనీ పంటలు ఏస్తన్నమంటే చేతినిండా సరిపడా పైసలుంటన్నయి. 50 ఏండ్లసంది ఎవుసం జేత్తన్న. గిట్ల తండ్రిలెక్క ఆదుకున్నోళ్లు ఎవ్వలు లేరు. బొందిల పాణం ఉన్నన్ని రోజులు అయిన మాటే ఇంటం.
– దాసారపు ఓదెలు, రైతు (వీణవంక)
తెలంగాణలో వ్యవసాయమంటే పురుగుల మందుతాగే పరిస్థితి నుంచి మా రైతుల గోస దీర్చి ఒక పండుగలా మార్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. నీళ్లు లేక, కరెంటు రాక మోటార్లు కాలిపోయేది, పొలాలు బీళ్లు వారేది. మా మండలంల ఎంతో మంది రైతులు పెట్టిన పెట్టువళ్లు రాక అప్పులపాలయి ఉన్నది అమ్ముకునేటోళ్లు. రైతులంటే బాగా చిన్న చూపు ఉండె. వ్యవసాయం చేస్తర్రు అంటే పిల్లను గూడ ఇచ్చెటోళ్లు గాదు. సీఎం కేసీఆర్ అచ్చినంక నీళ్లు పుష్కలంగా అత్తన్నయి, 24 గంటల కరెంట్ ఉంటంది. పెట్టువడికి అప్పులపాలు కావద్దని రైతుబంధు సాయం అందిస్తండు. పంటలు మంచిగ పండుతన్నయి, సర్కారు మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటంది. వారం రోజులల్ల బ్యాంక్ ఖాతాల పైసలు జమ చేస్తంది. ఇంతకుముందు నేను కాంగ్రెస్ల నాయకుడిగా పని జేసిన. అప్పుడు వ్యవసాయమంటే ఏడుపచ్చేది. నాకు ఎకరన్నర భూమి ఉన్నది. కేసీఆర్ సార్ ఇస్తున్న రైతుబంధు సాయంతో సంతోషంగ వ్యవసాయం జేసుకుంటన్న.
-ఉయ్యాల రాజు, రైతు, రెడ్డిపల్లి(వీణవంక)
మాకు పెట్టుబడి కింద ఎకరానికి రూ.5వేలు ఇత్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మా రైతులకు పెద్దదిక్కు. మాలాంటి పేద రైతులకు అండగా ఉంటుండు. నాకున్న 38గుంటల భూమికి రైతు బంధుకింద నా ఖాతాల 4,750లు ఇయ్యాల జమైనయ్. ఎవుసం పెట్టుబడికి అప్పులు జేసుడు తప్పింది. రైతుబంధు పెట్టి ఎకరానికి రూ.5వేలు ఇత్తున్న సీఎం కేసీఆర్ రైతులందరికీ ఆత్మబంధువు అయిండు. ఆయన మేలును మరువం.
-సుంకరి మోహన్, గుమ్లాపూర్, చొప్పదండి
సీఎంగా కేసీఆర్ సారు అయినంక రైతులకు మంచి జేత్తున్నడు. ఇది పదోసారి రైతుబంధు పైసలేయడం. నాకు ఎనిమిదన్నర గుంటల భూమి ఉంది. నాకు రైతు బంధు కింద రూ. 1062 పడ్డయ్. ఆ భూమిలో కూరగాయలు పండించుకుంటున్న. బుధవారం పైసలు పడతని తెల్వంగనే కొలనూర్ పోస్టాపీస్కు పోయిన. నాకు రూ.1062 పడ్డయని తెలిపిండ్రు. అక్కడనే రూ.వెయ్యి తీసుకున్న. కేసీఆర్ సారు పైసలేసినందుకు దండం పెడుతున్న.
– మిట్టపల్లి బాబు, రైతు, నాంసానిపల్లి (ఓదెల)
నాకు రైతు బంధు పథకం కింద పైసలు పడ్డట్టు మెసెజ్ వచ్చిందని మా కొడుకు చెప్తె మస్తు సంబురమైంది. నేను గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్గా పని జేత్త. నాకు 39 గుంటల ఎవుసం భూమి ఉంది. నాకు రూ. 4906 నా బ్యాంక్ ఖాతాల పడ్డయ్. సాన సంతోషంగ ఉంది. సీఎం కేసీఆర్ సారు ఏటా రెండు పంటలకు లాగోడికి ఇబ్బంది పడకుండ పైసలేత్తుండు. నాకు ఉన్న భూమిలో పొలం వేసుకుంటున్న. కేసీఆర్ సారుకు రుణ పడి ఉంటం.
– కుంచం దామోదర్, రైతు, కొలనూర్ (ఓదెల)
జిల్లాలో రిజిస్టర్ అయిన ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం. ఈ యాసంగిలో జిల్లాలో 1,51,805 మంది రైతులకు రూ.139కోట్లు విడుదల కానున్నాయి. తొలుత ఎకరంలోపు భూమి ఉన్న 91,938మంది ఖాతాల్లో రూ.43.09కోట్లు జమ చేశాం. మరో ఐదారు రోజుల్లో ఎకరానికి పైగా భూమి ఉన్న వారికి వేస్తాం. ఈ మేరకు ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి చేశాం.
– దోమ ఆదిరెడ్డి, డీఏఓ, పెద్దపల్లి.
కేసీఆర్ రైతుల కష్టాలను తెలుసుకుని పెట్టుబడి సాయం ఇత్తుండు. 24గంటల కరెంటు, సమయానికి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేయడంతో ఇబ్బందులు తప్పినయ్. నాకు 13గుంటల భూమి ఉంది. పెట్టుబడి సాయం కింద రూ, 1620 వత్తున్న య్. వీటితో చదును, కైకిళ్ల ఖర్చు ఎల్తంది. సర్కారుకు రుణపడి ఉంటం.
– పసుల లింగం రైతు, కొల్వాయి(సారంగాపూర్)
నాకు ఊళ్లే 20 గుంటల భూమి ఉన్నది. రైతుబంధు కింద రూ.2500 ఖాతాల జమైనయ్. మస్తు సంతోషమైతంది. ఇప్పటికే పదిసార్ల అచ్చినయ్. ఈ పైసలు యాసంగి వరి నాట్ల కైకిళ్లకు అక్కరికత్తయ్. నాలాంటి ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులకు సర్కారు సాయం ఎంతో ఉపయోగపడుతున్నది.
– బక్కురి శేఖర్, రైతు, రత్నాపూర్ (మల్లాపూర్)
నాకు ఎనిమిదెకరాల భూమి ఉన్నది. గతంల పెట్టుబడి కోసం అప్పులు జేసేది. అయినా నీళ్లు లేక కరెంట్ లేక పంటలు సగం ఎండిపోయేవి. వచ్చిన పైసలు అక్కడికక్కడికే అయ్యేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను తెలుసుకొని పరిష్కరిస్తుండు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని తీరుగ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు మేలు జేస్తుండు. నాకున్న ఎనిమిది ఎకరాలకు రూ.40వేలు ఖాతాలో జమైనయ్. ఇప్పుడు వరి పంట వేద్దామనుకుంటున్న. రైతుబంధు పైసలతో కూలీలకు ఖర్చు వెల్లిపోతది.
-ఎండ్రాల రాజు, రైతు, మామిడిపల్లి (కోనరావుపేట)