“మళ్లేసుడు కాదు.. ఇప్పుడే ఎలచ్చన్ పెట్టుర్రి. ఇప్పుడే తెలంగాణ పార్టీ గెలుస్తది. మిషన్ల గురించి తెల్వక మోస పోయినం. కేసీఆర్ దేవుడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మూడు నెలల్లో పొలాలు ఎండిపోయినయి.కరెంట్ పోయింది. ఫ్రీ బస్సుతో జనం సచ్చిపోతుండ్రు. రేవంత్రెడ్డి పింఛన్లు నాలుగు వేలు చేస్తా అన్నడు.. చేయకనే పాయే. రుణమాఫీ మాట లేదాయే, కల్యాణలక్ష్మి లేకపాయే.. తులం బంగారం అన్నడు.. ఎక్కడ పోయింది. మహిళలకు రూ.2500 ఇస్తన్నడు.. అవి ఎటుపాయే..కాంగ్రెస్ పార్టీ అంతా మోసం చేసింది. మీరు అనవసరంగా ఐదేండ్లు టైం పెట్టిండ్రు. ఇప్పుడు ఎలచ్చన్లు పెట్టుండ్రి.. మళ్ల కేసీఆర్ సార్ అస్తడు. కారుకు మళ్లేసుడే’.. అని గజ్వేల్ సమీకృత మార్కెట్ యార్డులో మెదక్ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డితో జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన ఐలవ్వ అన్నమాట. ఒక్క ఐలవ్వనే కాదు.. ఇలా సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న మాటలు ఇవే. కేసీఆర్ సార్ రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఇప్పుడు విసుగు వచ్చింది. ప్రజలంతా ఓట్లతో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇంటి పార్టీ బీఆర్ఎస్ తమకు శ్రీరామరక్ష అని గుర్తుచేస్తున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు మీద ఉన్నది. ప్రచారంలో కారు దూసుకపోతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో క్యాడర్లో జోష్ నెలకొంది. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సాయంత్రం కాగానే కేసీఆర్ సభల లైవ్లు చూస్తున్నారు. కేసీఆర్ ప్రసంగంపై ప్రజల మధ్యన చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకన్నా కేసీఆర్ నయమని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సబ్బండవర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామ చావిడి, చాయ్ హోటల్, నలుగురు కూర్చున్న చోట, మార్కెట్ యార్డుల్లో, బీడీల ఖార్కానా.. ఇలా ప్రతి దగ్గర ఇదే చర్చ జరుగుతున్నది. మళ్లీ తెలంగాణ ఉద్యమ రోజలు వచ్చాయని ప్రతి ఒక్కరిలో ఇదే చర్చ జరుగుతున్నది. అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాక ప్రజలను మోసం చేసిందని ప్రజలకు తెలిసివస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు భగ్గుమంటున్నారు. బీజేపీ అన్ని ధరలు పెంచి ఆగం చేసిందని, తెలంగాణకు ఆ పార్టీ చేసిందేమీ లేదని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ మనకు శ్రీరామరక్ష అని గట్టిగా విశ్వసిస్తున్నారు. వారం రోజులుగా బీఆర్ఎస్కు మంచి ఆదరణ కనిపిస్తున్నది. మేలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్రలు, సభలు ఉన్నాయి. మెదక్ నుంచి డబుల్ హ్యాట్రిక్, జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్కు మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఇక్కడ సైతం విజయం సాధిస్తామన్న ధీమా గులాబీ క్యాడర్లో నెలకొన్నది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కారు ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతరేకత ఏర్పడింది. వివిధ వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఎన్నికల్లో తమ స్పష్టమైన తీర్పు చెప్పడానికి ప్రజలు సన్నద్ధ్దమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పది శాసనసభా స్థానాలకు ఏడు బీఆర్ఎస్ గెలుచుకున్నది. బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటడానికి క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తున్నది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ వద్ద మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఆశీర్వాద సభను బీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం హాజరయ్యారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు. ఈ సభతో క్యాడర్లో జోష్ వచ్చింది. మరోవైపు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, సమావేశాల్లో పాల్గొంటూ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు అర్థ్ధమయ్యే తరహాలో వివరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లా మీద కక్షకట్టింది. అభివృద్ధి పనుల నిధులను ఆపారు. రోడ్ల పనులు రద్దు చేశారు. సిద్దిపేట నుంచి విద్యాసంస్థలను కొడంగల్కు తరలించుకపోయిన విషయాన్ని ప్రజల మధ్య చర్చ పెడుతున్నారు. ఆరు గ్యారెంటీలు, అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఇటీవల వడగండ్ల వర్షంతో ధాన్యం తడవడంతో సిద్దిపేట, మెదక్ జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాలను హరీశ్రావు సందర్శించారు. ఆ సమయంలో రైతులు తమ గోడు చెప్పుకున్నారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయామని చెప్పారు. కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని అక్కడ రైతులు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో సబ్బండ వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే అది కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. సర్వే ఫలితాలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండడంతో క్యాడర్లో రెట్టించిన ఉత్సాహం నెలకొన్నది. పార్టీ విజయ మే లక్ష్యంగా పనిచేస్తున్నారు.