నేటినుంచి రెండో విడత కంటివెలుగు కార్యక్రమం గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో అమలు కానున్నది. షెడ్యూల్ ప్రకారం వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ రెండో విడత కంటివెలుగును గురువారం ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. సెలవు దినాలు మినహాయించి వంద రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. నేడు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు. శిబిరాలు నిర్వహించే తేదీలు, ప్రాంతాల వివరాలను కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నారు. కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 9గంటల నుంచి కంటివెలుగు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 18 లక్షల మందికి, మెదక్ జిల్లాలో 4.72 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది.
మెదక్/ సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 18 : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మెదక్ జిల్లాలో సుమారు 4,72,802 మందికి, సంగారెడ్డి జిల్లాలో 17,11,685 మందికి కంటి పరీక్షలు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడత కంటి వెలుగును 2018 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మలాపూర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేండ్ల తర్వాత రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 544 శిబిరాలు.. 40 బృందాలు..
మెదక్ జిల్లా జనాభా 7.67 లక్షలు ఉండగా, 4.72 లక్షల మందిని గుర్తించారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఈ నెల 19 నుంచి వంద రోజుల పాటు శిబిరాలు ఏర్పాటు చేసేందుకు గ్రామ, వార్డు వారీగా షెడ్యూల్ రూపొందించారు. జిల్లాలో 544 శిబిరాలను ఏర్పాటు చేశారు. 40 బృందాల ద్వారా 4,72,802 మందికి కంటి పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో 32 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, 8 బృందాలు అర్బన్ ఏరియాలో శిబిరాలను నిర్వహిస్తాయి. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 18 ఏండ్లు నిండిన వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలు, పెద్దలు, వృద్ధులను అడిగి వారి కంటిలోని లోపాలను గుర్తించి నమోదు చేసుకునేలా ప్రణాళిక తయారు చేశారు. 20 పీహెచ్సీల పరిధిలో అప్తాల్మిక్ అధికారులు 40 మందిని నియమించారు. 40 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో 854 క్యాంపులు..
సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లోని 199 వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు వార్డుల్లో అధికారులు 854 క్యాంపులను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 18 లక్షల జనాభా ఉండగా, 69 బృందాలతో 17,11,685 మందికి స్క్రీనింగ్ చేసేందుకు వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు, సర్పంచులు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ప్రజల్లో కంటి వెలుగుపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. కంటి పరీక్షల నిర్వహణ కోసం 69 మంది అప్తాల్మిక్ అసిస్టెంట్లు, 921 మంది ఆశవర్కర్లు, 125 మంది సూపర్వైజర్లు, 69 మంది మెడికల్ ఆఫీసర్లు, 69 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 345 మంది ఏఎన్ఎంలను నియమించారు. నియోకజవర్గాకి ఒకరు చొప్పున నోడల్ ఆఫీసర్లు, మండలానికి ఒకరు చొప్పున ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ల బృందం కంటివెలుగు పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు. కంటివెలుగు శిబిరాల్లో పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాకు ఇప్పటికే మొదటి విడతగా 64,903 కళ్ల అద్దాలు పంపింది.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
కంటి వెలుగు శిబిరాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా షామియానా, తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్, మరుగుదొడ్ల ఏర్పాటు బాధ్యతలను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అప్పగించారు. ఇందుకోసం ప్రతిరోజు వెయ్యి రూపాయలు, బృందం సభ్యులకు రోజు రూ.1,500 చొప్పున డీఏను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది. వాహనాలను కూడా సమకూరుస్తున్నారు. ఏ గ్రామంలో, ఏ వార్డులో ఏ రోజు శిబిరం ఏర్పాటు చేస్తున్నారో అని సర్పంచులు, ఎంపీటీసీలు, మెప్మా, స్వయం సహాయక బృందాలు, కౌన్సిలర్లు, ప్రజలకు అవగాహన కలిగించేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాల పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రారంభించనున్న ప్రజాప్రతినిధులు..
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలో తూప్రాన్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మెదక్ గాంధీనగర్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, నార్సింగి మండలం సంకాపూర్ తండాలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, పెద్దశంకరంపేటలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, రేగోడ్ మండలంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రారంభిస్తారని మెదక్ డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు పీహెచ్సీలో కార్యక్రమాన్ని జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఒకో బృందం ప్రతిరోజు 150 మందికి పరీక్షలు..
ఒకో బృందంలో మొత్తం 10 మంది సభ్యులుంటారు. వీరిలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక కంటి వైద్య నిపుణులు (ఆప్తామాలజిస్ట్), ఇద్దరు ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఆశాకార్యకర్తలు, ఒక ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. ఒకో బృందం ప్రతిరోజు 150 మందికి పరీక్షలు చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేయించుకునేందుకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్కార్డును వెంట తీసుకురావాల్సిందే. శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు
చేశారు.
‘కంటి వెలుగు సాఫీగా జరగాలి’
సదాశివపేట, జనవరి 18: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి వెలుగు కార్యక్రమం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని ఆత్మకూర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ నిర్వహిస్తున్న ట్రయల్ రన్ను పరిశీలించారు. పీహెచ్సీ పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు నిబంధనల మేరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పకడ్బందీగా చేసిన ఆయా మెడికల్ ఆఫీసర్, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి తదితరులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చే వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి, కంటి వెలుగు వైద్యబృందం, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతున్నది. 18 ఏండ్ల పైబడిన వారందరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. నిర్వహణకు సంబంధించి గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ స్థాయి సూక్ష్మ ప్రణాళికలను ఆయా అధికారులు, ప్రజాప్రతినిధులకు అందజేశాం. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుశాఖ చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలి.
– కలెక్టర్ శరత్, సంగారెడ్డి
లక్ష్యాన్ని చేరుకుంటాం..
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం మెదక్ జిల్లాలో 40 బృందాలను ఏర్పాటు చేశాం. వంద రోజుల్లో శిబిరాల నిర్వహణ పూర్తి చేయడమే లక్ష్యం. 40 మంది అఫ్తాలమాజిస్ట్ ఆఫీసర్లు, 40 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాం. రెండో విడతలో 4,72,802 మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.
– డాక్టర్ చందునాయక్, డీఎంహెచ్వో మెదక్
సిద్దిపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : జిల్లాలో నేటి నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఖమ్మం వేదికగా రెండో విడత కంటి వెలుగు 2-0ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి జూన్ 15తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో, మున్సిపాలిటీలోని వార్డుల్లో కంటి వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కంటి వెలుగు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆదిశగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గ్రామాల్లో విస్తృత ప్రచారం సైతం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 45 బృందాలను ఏర్పాటు చేయగా, మరో మూడు బఫర్ బృందాలుగా నియమించారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఈ బృందాలను పంపుతారు. ఒక్కో బృందంలో ఒక వైద్యాధికారి, ఒక ఆప్తమాలజిస్ట్, ఇద్దరు లేదా ముగ్గురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు డెటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు ఆశవర్కర్లు ఉంటారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు లేదా స్థానిక నివాస ధ్రువపత్రం తీసుకురావల్సి ఉంటుంది. ఒక్కో బృందంలో అందరూ కలిపి 10 మంది సిబ్బంది ఉండనున్నారు. ఇలా 45 బృందాలకు గానూ 450 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంటి వెలుగును విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా వైద్యాధికారి కాశీనాథం, జిల్లా అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డితో పాటు పోలీస్ కమిషనర్ శ్వేత ఇతర అధికారులు కంటి వెలుగుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు. గ్రామాల్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి వైద్య సిబ్బంది కంటి వెలుగు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఇక మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కంటి వెలుగుకు వచ్చే వారికి టోకెన్లు జారీ చేశారు. జిల్లాకు ఇప్పటి వరకు 42 వేల కంటి అద్దాలు సరఫరా చేశారు. అవసరమైన మిషన్లు ఆయా శిబిరాలకు అందించారు. 45 వాహనాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాలకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కంటి పరీక్షలకు వచ్చే వారు తమ ఆధార్కార్డును తీసుకురావల్సి ఉంటుంది. శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వెంటనే రీడింగ్ అద్దాలు అందిస్తారు. కంటి చూపు సమస్య ఉన్న వారికి వారం నుంచి 10 రోజుల్లో వారి ఇంటికి అద్దాలు అందజేస్తారు.