ఈనెల 18 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి మెదక్, సంగారెడ్డి జిల్లాల యంత్రాంగాలు సిద్ధమవుతున్నాయి. శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికా ప్రకారం బృందాలు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్డ్రిల్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ డెమో పరిశీలించి సూచనలు చేశారు. మెదక్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించి కంటివెలుగు కార్యక్రమం విజయవంతానికి దిశానిర్దేశం చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 13: కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమయ్యిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ‘కంటి వెలుగు’పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కంటి వెలుగుకు సంబంధించిన డెమో పరిశీలించారు. ఐదు రకాల టేబుల్లలో ఉండే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అంధత్వానికి గురైన జిల్లా ప్రజల కంటి సమస్యలు నివారణ కోసం చర్యలు చేపట్టామన్నారు. అత్యున్నత, నాణ్యత కలిగిన వైద్యం అందించేందుకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఉచిత కంటి శిబిరం ఏర్పాటుకు గ్రామ, మండల జిల్లా పరిధిలోని అధికారులు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఏ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందో ముందస్తుగా సంబంధిత గ్రామ ప్రజలకు తెలిసేవిధంగా 3 రోజుల ముందు నుంచి టాంటాం ద్వారా తెలియజేయాలని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకునేవిధంగా సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది ప్రజలను ఆ దిశగా చైతన్యం చేయాలన్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు, అవసరమైన వారికి ఇస్తారనే విషయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజలు వచ్చే ముందు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, లేని పక్షంలో ఆరోగ్యశ్రీ కార్డును వెంట తీసుకొని రావాలని తెలిపారు. అనంతరం వైద్యులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కలెక్టర్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా కంటి వెలుగు కిట్లు, ఎంవీఐతో ధ్రువీకరించిన వాహనాలను 69 వైద్య బృందాలకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి, డిప్యూటీ వైద్యాధికారి, ప్రోగ్రాం అధికారులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.