సిద్దిపేట, మే 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతున్నది. చేయి తడపనిదే ప్రజలకు పనులు కావడం లేదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది.. మేము ఏం చెబితే అదే నడుస్తుంది.. మేము అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి..ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయి అంటూ లబ్ధ్దిదారుల వద్ద కొందరు కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఏదో ఒక రకంగా డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు.
ఇటీవల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి అందినకాడికి పైసలు వసూలు చేస్తున్నారు.వీరికి కొందరు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కల్యాణలక్ష్మి పథకానికి ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పనులు కావడంలో లేదు.
ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసి, ఆ రేటు ప్రకారం డబ్బులు ముట్టజెప్పితేనే పనులు చేస్తున్నారని పేదలు వాపోతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ద్వారా పైసలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు జిల్లాలో బలంగా ఉన్నాయి. నెలల తరబడి కల్యాణలక్ష్మి చెక్కులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో చెక్కులు మంజూరైనా వాటిని పంపిణీ చేయకుండా ఆపివేస్తున్నారు.దీనికి పలు కారణాలు ఉన్నాయి. జిల్లా మంత్రి సమయం ఇవ్వకపోవడంతో చాలాచోట్ల పెండింగ్లో పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
పెండింగ్లో దరఖాస్తులు..
సిద్దిపేట జిల్లాలో వందల సంఖ్యలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. చాలా మండలాల్లో తహసీల్దార్ లాగిన్లోనే పెండింగ్లో పెట్టారు. దాదాపు అన్ని మండలాల్లో లబ్ధిదారుల నుంచి చోటా బడా నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తును క్లియర్ చేయడానికి తహసీల్ కార్యాలయంలోనే కాసుకొని కూర్చున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటారు.
ఈ దరఖాస్తును స్థానిక తహసీల్ కార్యాలయంలో లబ్ధ్దిదారుడు అప్పజెప్పుతాడు. మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్థానిక తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది. అక్కడ తహసీల్దార్ దానిని పరిశీలించి ఆర్డీవోకు పంపుతారు. ఇలా ప్రాసెస్ పూర్తయ్యాక లబ్ధిదారునికి పథకం మంజూరు అవుతుంది. కానీ, ఇక్కడే అసలు తతంగం నడస్తున్నది. ఆయా మండల కేంద్రాల్లోని స్థానిక తహసీల్ కార్యాలయ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మక్కు అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కార్యాలయానికి వచ్చిన దరఖాస్తు జాబితాను కాంగ్రెస్ నాయకులకు చేరవేస్తున్నారు. ఆ జాబితా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు ఫోన్ చేసి మీరు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కదా.. మాకు రూ. 5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వాలని, ఇస్తే మీ పనులు అవుతాయని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు కావని బెదిరిస్తున్నారు. చేసేదేమి లేక లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది.