సిద్దిపేట, ఫిబ్రవరి 11: అధికారంలోకి వస్తే ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు లక్షా నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మాట మార్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు రూ. 12 వేల కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. వృద్ధులకు ఆసరా కింద రూ.4 వేల చొప్పున పింఛన్ అందిస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. జనవరి, ఫిబ్రవరికి సంబంధించిన రూ. 2 వేల చొప్పున పింఛన్ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందిస్తామని చెప్పి, కనీసం 16 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని,దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని హరీశ్రావు చెప్పారు. కార్యక్రమంలో రాజనర్సు, రవీందర్రెడ్డి, పాల సాయిరాం, జాప శ్రీకాంత్రెడ్డి, కోల రమేశ్గౌడ్, కౌన్సిలర్ గ్యాదరి రవీందర్, బీఆర్ఎస్ నాయకులు మోయిజ్, రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.