అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదు
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్
ప్యాకేజీ 13, 15లకు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని ఏజెన్సీలకు ఆదేశం
మెదక్, మే 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజె క్టు పనులకు సంబంధించి మెదక్ జిల్లాలో భూసేకరణ, సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడి యో కాన్ఫరెన్స్ హాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, భూ సేకరణ, ప్యాకేజీ పనులకు సంబంధించి నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, వర్క్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేదిలేదని ఏజెన్సీలను హెచ్చరించారు. ప్రధానంగా రామాయంపేట కాలువకు సంబంధించి భూ సేకరణ పనులు, చిన్నశంకరంపేట్కు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి, ప్యాకేజీ 13, 15లకు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రజలకు కాళేశ్వరం నీటిని అందించేందుకు చేపట్టనున్న కాలువల నిర్మాణానికి ఇప్పటి వరకు సేకరించిన భూమి, మిగతా సేకరణ జరుగకపోవడానికి గల కారణాలు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులను సామరస్యపూర్వకంగా పరిష్కరించి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి, సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ ఏసయ్య, ఈఈ శ్రీనివాస్రావు, ఆర్డీవో సాయిరామ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రెవెన్యూ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.