చేగుంట, జనవరి 23 ః కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా తెచ్చుకుని పంటలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండ, నర్సంపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పెద్దతండాలో రూ.20లక్షలతో పంచాయతీ భవనం, రూ.10లక్షలతో ఎస్టీ కమ్యూనిటీ భవనం, రూ.40లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మనఊరు -మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.23 లక్షలతో నిర్మించనున్న పాఠశాల ప్రహరీకి భూమి పూజ చేశారు. అనంతరం నర్సంపల్లిలో రూ.4.50లక్షలతో నిర్మించిన అంగన్వాడీ, రూ.17లక్షలతో పల్లెదవాఖాన, రూ.20లక్షలతో పంచాయతీ, రూ.10 లక్షలతో మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో పల్లెల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కాళేశ్వరం జలాలను కాల్వల ద్వారా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని, పెండింగ్లో ఉన్న కాల్వల నిర్మాణం పూర్తి చేసేలా సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సాగునీటి శాఖ మంత్రులను కలిసి కాల్వలు పూర్తి చేయాలని కోరానన్నారు. కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీలు చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలరాం బాబు, సర్పంచులు ఛత్రీయ నాయక్ బొమ్మగారి భారతీసత్యం, సొసైటీ చైర్మన్ శంకర్గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు రాజేష్, శ్రీపతిరావు, జెట్టి స్వామి, విష్ణువర్ధన్రెడ్డి, భాషా, లాలు, ముస్తాక్, సీడీపీవో స్వరూప, ఐకెపీ ఏపీఎం అశోక్, సీసీ సుల్తానా, రమేశ్తో పాటు వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.