సిద్దిపేట టౌన్, ఆగస్టు 8 : మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయని, 2023-25 సంవత్సరాలకు పాత మద్యం పాలసీని అమలు చేస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ స్పష్టం చేశారు. సిద్దిపేట ఎక్సైజ్ స్టేషన్లో జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తితో కలిసి మంగళవారం మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికిషన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలోకి వస్తే టెండర్లను పిలువడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ముందుస్తుగా దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించామన్నారు. సిద్దిపేట జిల్లాలో 5 ఎక్సైజ్ సర్కిళ్లలో 93 మద్యం దుకాణాలు ఉన్నాయని, ఇందులో గతంలో మాదిరిగా ఎస్సీలకు 9, గౌడ్ సామాజికవర్గానికి 16 రిజర్వేషన్లు ద్వారా కేటాయించి, మిగిలిన 63 దుకాణాలకు ఓపెన్ టెండర్లు ద్వారా కేటాయిస్తామన్నారు. ఒక్క వ్యక్తి ఎన్ని అయినా దరఖాస్తులు వేయవచ్చని తెలిపారు.
గతేడాది మాదిరిగానే రూ.2లక్షల సులభతరమైన దరఖాస్తు విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. 21 ఏండ్లు నిండిన వారు దుకాణాల ఏర్పాటు టెండర్లును వేయవచ్చని, రూ.25వేల చెల్లించి షాప్ను సులభంగా షిష్ట్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. గతంలో నాలు గు వాయిదాల్లో మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించేవారని, ప్రస్తుతం వ్యాపారుల ప్రయోజనార్థనం ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును ఇచ్చామన్నారు. మద్యం దుకాణాల టర్నోవర్ లిమిట్ను 10 రెట్లకు పెంచామని, గతంలో 7 రెట్లు మాత్రమే ఉండేదని, ప్రివిలేజ్ ఫీ 10శాతానికి తగ్గించామన్నారు. దీంతో జిల్లాలో 80 మద్యం దుకాణాల వ్యాపారులు నాలుగు నెలల ముందే అధిక లాభాలను అర్జించారని చెప్పారు. ఎక్సైజ్ శాఖ మద్యం వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని మంచి పాలసీ రూపొందించిందని, లాభాలు తప్ప నష్టం ఏమాత్రం ఉండదన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి దరఖాస్తులను సమర్పించాలన్నారు.
ఈ నెల 18న సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరణ ఉంటుందని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా 9 కౌంటర్లను ఏర్పాటు చేశామని, కార్యాలయం పనిరోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మూడు స్లాబ్ల విధానం అమలవుతుందని, ఇందులో జనాభా ప్రాతిపదికన పట్టణ రూ.65 లక్షలు, అర్బన్ రూ.55 లక్షలు, రూరల్ రూ.50 లక్షల రుసుం ఏడాదికి కేటాయించామన్నారు. ఈ నెల 21న విపంచి కళా నిలయంలో కలెక్టర్ సమక్షంలో దుకాణాలకు ఎంపిక డ్రా పద్ధతిలో కేటాస్తామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు బ్రహ్మనందరెడ్డి, గాయత్రి, మహేంద్రకుమార్, శ్రీనివాస్, పవన్, శ్రీధర్ పాల్గొన్నారు.