మోడల్ మర్కూక్ ఐఓసీ..!
మర్కూక్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత భవనాలు
రూ.5 కోట్లతో కార్యాలయాల నిర్మాణం
మూడు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక
హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మర్కూక్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కార్యాలయాల భవనాలు నిర్మించేందుకు గత నెలలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారనుంది.
మర్కూక్, జూన్ 24 : మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. మర్కూక్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కార్యాలయాల భవనాలు నిర్మించేందుకు గత నెలలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకేచోట సమీకృత భవనాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుకూలంగా గజ్వేల్ నియోజకవర్గంలో సమీకృత భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
మండలంలో 16 గ్రామ పంచాయతీలు
మర్కూక్ మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త మండలం కాబట్టి అన్ని శాఖలకు సొంత భవనాలు లేక అధికారులు అద్దె భవనాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది రాష్ట్రంలోని మోడల్గా ముందు రూ.10కోట్లతో పోలీస్స్టేషన్ను నిర్మించారు. పోలీస్స్టేషన్ తప్ప మిగతా అధికారుల కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్లో నాలుగేండ్ల క్రితం సమీకృత భవనాలకు శ్రీకారం చుట్టి నిర్మించారు. కార్యాలయాలు ఒకేచోట నిర్మించడంతో ప్రజలకు అన్నిశాఖల అధికారుల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇదే మదిరిగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రాల్లో సమీకృత భవనాలకు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ పక్కన సర్వే నంబర్ 603లోని ప్రభుత్వ భూమిలో ఆరు ఎకరాల స్థలాన్ని సమీకృత భవనాలకు గుర్తించి మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనుల ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. మండలాల్లో ముందుగా మర్కూక్ మండల కేంద్రంలోనే పూర్తి చేసి మిగతా మండలాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
మర్కూక్లో నిర్మించే మోడల్ ఇదే
మంచి నిర్ణయం..
మండల కేంద్రాల్లో సమీకృత భవనాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. గతంలో పని కావాలంటే కార్యాలయాలు ఒకచోట లేక రోజుల తరబడి తిరిగేవారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఒకేచోట అధికారుల సేవలు అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ మండల కేంద్రాల్లో సమీకృత భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం హర్షణీయం.
– పాండుగౌడ్, ఎంపీపీ, మర్కూక్
ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు
టీఆర్ఎస్ హయాంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేరాయి. సీఎం కేసీఆర్ , మంత్రి హరీశ్రావు గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. అన్నిరకాలుగా మర్కూక్ మండలాన్ని అభివృద్ధి చేశారు. సమీకృత భవనాలతో మరింత అభివృద్ధి జరగనున్నది. మండల ప్రజలకు అన్నిరకాల సేవలు ఒకేచోట అందనున్నాయి.
– కరుణాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మర్కూక్