జహీరాబాద్, ఫిబ్రవరి 18: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కేతకీకి భక్తులు పోటెత్తారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా అమృత గుండంలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్లు సంగమేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావులకు దేవాలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.
సిద్దేశ్వర్ స్వామి దేవాలయంలో..
జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ రోడ్డులో ఉన్న సిద్దేశ్వర్ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి వారిని దర్శంచుకొని పూజలు చేశారు. అలాగే, కైలసగిరి శివాలయంలో భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
బారులు తీరిన భక్తులు
స్వామి వారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిలుచున్నారు. శివస్వాములు ఇరుముడి సమర్పించేందుకు భారీగా తరలివచ్చారు. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన భక్తులు అమృతగుండంలో స్నానాలు చేసి గర్భగుడిలో ఉన్న శివలింగానికి పూజలు చేశారు. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
పోలీసుల భారీ బందోబస్తు
ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు పర్యవేక్షణలో జహీరాబాద్, జహీరాబాద్ రూరల్ సీఐలు తోట భూపతి, వెంకటేశ్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు వద్ద వాహనాలు నిలిపివేశారు. క్యూలైన్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అధికారులు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు
వివరించారు.