హుస్నాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో సాగుచేసిన పంటల్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధ్దతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు పలు సూచనలు జారీ చేసింది. సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటల్లో లోతు కాలువల ద్వారా నీటిని బయటకు తీసివేయాలని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా యాజమాన్య పద్ధతులు పాటించడంతో కలుపును అదుపు చేయవచ్చని, మొక్కల వేర్లకు గాలి తగలడంతో పెరుగుదల బాగా ఉంటుందని తెలిపారు. పంట విత్తిన నాటి నుంచి 20 రోజులు దాటితే భాస్వరం, కాంప్లెక్స్ ఎరువులను వాడడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. పంట తొందరగా కోలుకోవడానికి నీరు తగ్గిన తర్వాత సూచించిన మేరకు నత్రజనిని నేలపైన వేయకుండా మట్టిలో కలిసేలా జాగ్రత్త వహించాలని సూచించారు.
వరి సాగులో ఇప్పటి వరకు నార్లు పోసుకోని రైతులు దమ్ము చేసిన పొలాల్లో స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేసుకొని నేరుగా విత్తనం వెదజల్లుకోవాలి. -ఒకవేళ తప్పనిసరిగా నార్లు పోసుకోవాలనుకునే రైతులు ఎత్తయిన నారుమడుల పద్ధతిలో సిఫారసు చేయబడిన రకాలను (దొడ్డు గింజల రకాలు జేజీఎల్ 24423, కేఎన్ఎం 118, జేజీఎల్ 18047, ఎంటీయూ 1010, సన్న గింజల రకాలు.. ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962 రకాల ఎంపిక చేసుకోవాలి. ఎకరాకు 20-25 కిలోల వరి విత్తనాన్ని ఉపయోగించి 2 గుంటల నారుమడిలో నారు పెంచి 20-25 రోజుల వయస్సు గల నారుతో నాట్లు పూర్తి చేసుకోవాలి.
అధిక వర్షాలకు చెరుకు గడలు/ మొక్కలు నేలవాలకుండా నివారించడానికి ఎండిన ఆకులతో మొక్కలను జడలు అల్లుకోవాలి. వానలు ఆగిన తరువాత ఎకరాకు 50 కిలోల పొటాష్, 50 కిలోల యూరియా మొక్కల మొదళ్ల దగ్గర వేసి గుంటలు చేసి కప్పుకోవాలి.
పత్తి విత్తుకునే సమయం దాటి పోయింది. అందువల్ల పత్తి ప్రస్తుతం విత్తుకోవద్దు. విత్తితే సరైన పెరుగుదల లేక పూతవచ్చి దిగుబడులు తగ్గుతాయి. అధిక వర్షాలతో నేలలో తేమ అధికంగా ఉండడంతో ఆంథోసయనిన్ పిగ్మెంట్ గాఢత పెరగడంతో ఆకులు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. ఇది చూడడానికి మెగ్నీషియం దాతువు లోపంలాగా కనబడుతుంది. మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వర్షాలకు వేరు వ్యవస్థ దెబ్బతింటే 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిసేలా పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా మొక్కలకు 3-5 సెం.మీ దూరంలో అంతే లోతులో వేసి మట్టితో కప్పాలి. కలుపు నివారణకు ఎకరాకు 500 మి.లీ క్విజలోఫాప్ ఇథైల్ 4శాతం ఈసీ, పైరిథాయోబ్యాక్ సోడియం 6శాతం ఈసీ లేదా 250మి.లీ ప్రోపాక్విజాఫాప్ 10శాతం ఈసీ, 250 మి.లీ పైరిథాయోబ్యాక్ సోడియం 10శాతం ఈసీ మిశ్రమం చేసి కలుపు మందును పిచికారీ చేయాలి.
95 నుంచి 105 రోజుల మధ్యకాలిక సంకరాలైన డీహెచ్ఎం 117, 90-95 రోజుల పంటనిచ్చే డీహెచ్ఎం 121 లేదా స్వల్పకాలిక సంకరాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో విత్తిన మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది. నివారణకు 6.0 మి.లీ సయాంట్రానిలిప్రోల్, థయోమిథాక్సాం మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి.
గతేడాదితో పోలిస్తే వర్షాకాలంలో కంది విస్తీర్ణం 1.5 లక్షల ఎకరాల్లో తక్కువగా ఉంది. దేశంలో 15 లక్షల ఎకరాల్లో సాగు లోటు ఉంది. ఈ సంవత్సరం కంది పంటకు ధర అధికంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం కంది పంటను విత్తుకోవచ్చు. మధ్య, స్వల్పకాలిక కంది రకాలైన వరంగల్ 97 లాంటి రకాలను ఎంపిక చేసుకొని మొక్కల మధ్య ఎడం తగ్గించి (120-120 సెం.మీ) ప్రస్తుత సమయంలో విత్తుకోవచ్చు. నేలలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఇనుప దాతువు లోపంతో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. నివారణకు 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 0.5 గ్రాముల సిట్రిక్ ఆసిడ్, 20 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాలకు ఫైటాప్తోర ఎండుతెగులు గమనించినచో నివారణకు, 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
నీటి వసతి ఉన్న ప్రాంతాలు, కాలువల ద్వారా నీరు వచ్చే ప్రాంతాల రైతులు ఆగస్టు 31 వరకు శ్వేత, జేసీఎస్1020, జేసీఎస్ 2454, హిమ రకాలను ఎంపిక చేసుకొని విత్తుకోవచ్చు. పంటను చీడపీడల నుంచి రక్షించుటకు కిలో విత్తనానికి 3 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్, 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మందును వేసుకోవాలి.