జనగామ, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమ రెండు రోజులుగా అటు చేర్యాల, ఇటు జనగామ మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటిస్తూ జనంలోకి వెళ్తున్నారు. తీవ్ర గొంతు ఇన్ఫెక్షన్తో పల్లా హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఆయన సతీమణి నీలిమ, కుమారుడు అనురాగ్రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. జనగామ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరవేసి సత్తా చాటేందుకు కుటుంబ సభ్యులు భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి పల్లెలు, పట్టణంలో ఒక విడత ప్రచారాన్ని హోరెత్తించగా, ఆయనకు మద్దతుగా సతీమణి, తనయుడు రంగంలోకి దిగాడు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ శనివారం జనగామ పట్టణంలో ఆయన సతీమణి నీలిమ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. మహిళలు బోనాలతో పల్లా సతీమణికి స్వాగతం పలకగా, డప్పుచప్పుళ్లు, మేళతాళాలతో ఇంటింటి ప్రచారం జోరుగా సాగిం ది. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మహిళలు, వృద్ధులు, వికలాంగుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
మున్సిపల్ పరిధిలోని 26, 27, 22వ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ జమున, వైస్ చైర్మన్ మేకల రామ్ప్రసాద్, కో-ఆప్షన్ సభ్యురాలు ఉల్లెంగుల నవ్య, ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు బండ యాదగిరిరెడ్డి, పోకల లింగయ్య, వెన్నం సత్యనిరంజన్రెడ్డి, రాజు, జైన రమేశ్, బిజ్జాల నవీన్, గుర్రం నాగరాజు, మహిళా నాయకులు వెన్నం శ్రీలత, చెంచారపు పల్లవి, కొలగాని కావ్య, చొల్లేటి వనజ, మున్సిపల్ కౌన్సిలర్లు బండ పద్మ, సుధా, స్వరూప, పాక రమతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో’ అంటూ నీలిమ గడపగడపనూ తడుతూ వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే జనగామ పట్టణ రూపురేఖలు మారుతాయని చెబుతున్నారు. జనగామ నుంచి రాజేశ్వర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటి నుంచి కష్టపడే వ్యక్తి అని, ప్రతి గ్రామం, పట్టణానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని పరిష్కరిస్తారని తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చి మీ అందరి మెప్పు పొందుతారని ఆశిస్తున్నానని, మీరంతా పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ సందర్బంగా బోనాలతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. కూరగాయలు అమ్మే మహిళలు, బీడి కార్మికులకు దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.