సిద్దిపేట టౌన్, మార్చి 11: సిద్దిపేట గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించిన శ్రీరామకల్యాణ మండపాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే శాశ్వత అన్నదాన సత్రాన్ని నిర్మించుకున్నామన్నారు. భవిష్యత్లోనూ ఆలయ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే హరీశ్రావుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పూజల వెంకటేశ్వరరావు, మచ్చవేణుగోపాల్రెడ్డి, సాయిరామ్, శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ కాటం శోభ, సుందర్, బచ్చు రమేశ్, ఆలయ అర్చకుడు వెంకట రమణాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట,మార్చి11: ఏకలవ్యుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలో రూ.5 లక్షలతో ఏకలవ్య మిత్రమండలి భవనానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యనారాయణ ఎమ్మెల్సీ నియామకాన్ని గవర్నర్ రిజెక్ట్ చేసే అధికారం లేదని పునర్ పరిశీలించాలని హైకోర్టు చెప్పిందన్నారు. సుమారు రూ. కోటి 10 లక్షలతో సిద్దిపేటలో ఏకలవ్య భవనం నిర్మించుకున్నామన్నారు. సిద్దిపేట ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అభివృద్ధిలో సిద్దిపేటను అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు పాల సాయిరామ్, వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, వరాల సురేశ్, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిద్దిపేట, మార్చి11: పలు కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సోమవారం పరామర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ మాజీ సర్పంచ్ భిక్షపతి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. అర్బన్ మండలం ఎన్సాన్పల్లి మాజీ సర్పంచ్ రవీందర్గౌడ్ తల్లి మరణించగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పరశురాములు గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్ నాయిని చంద్రం ఉన్నారు.