పటాన్చెరు, మే 25: ప్రముఖ కవి, గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం యూనివర్సీటీ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూన్ 3వ తేదీన హైదరాబాద్ గీతంలో 14వ స్నాతకోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నట్లు గీతం యూనివర్సీటీ వర్గాలు గురువారం తెలిపాయి. గీతం కులపతి డాక్టర్ వరందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగే 14వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా ఐఎస్బీ వ్యవస్థాపక డీన్ ప్రొఫెసర్ ప్రమత్రాజ్ సిన్హా, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 14వ పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జూన్ 3న మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్లు గీతం హైదరాబాద్ ప్రొఫెసర్ వైస్ ఛాన్స్లర్ డీఎస్.రావు వెల్లడించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ కోర్సులను 2022-23 విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమోలు పొందడానికి అర్హులన్నారు. ఇదే కార్యక్రమంలో గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తున్నట్లు వైస్ ఛాన్స్లర్ డీఎస్రావు తెలిపారు. గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ వరించడంతో పలువురు కవులు, గాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.