మెదక్, మే 2(నమస్తే తెలంగాణ): మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కురోటితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కురోటి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు 25 శాతం, వీవీ ప్యాట్లు 40శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు.
మొదటి దశ ర్యాండమైజేషన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా నియోజకవర్గం, పోలింగ్ బూత్ వారీగా ఏఏ యంత్రాలు కేటాయించాలో జనరేట్ చేసిన జాబితాను అందజేస్తున్నట్లు తెలిపారు. ఆ జాబితా ప్రకారం వాటిని పటిష్ట భద్రత మధ్య తరలించి ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లో భద్రపరుస్తామని చెప్పారు. రెండోదశ సిబ్బంది ర్యాండమైజేషన్ జరుగుతుందని, మూడో దశ ర్యాం డమైజేషన్లో ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల సిబ్బంది అందరూ విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.