హత్నూర, ఆగస్టు 29: ప్రొటోకాల్ పేరుతో చెక్కుల పంపిణీని అడ్డుకోవడం సరికాదని, ప్రొటోకాల్ పాటించడంలో ఎప్పుడూ ముందుంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం హత్నూర రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ నాయకులు స్టేజీపైకి ఎలా వెళ్తారని, కాంగ్రెస్ నాయకులకు, స్థానిక ఎంపీ రఘునందన్రావుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి తప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు రాక ఏడాది గడుస్తున్నదని, వచ్చిన చెక్కులను పంపిణీ చేయవద్దనడం సమంజసం కాదన్నారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన చేస్తున్న నాయకులకు నచ్చజెప్పి సజావుగా పంపిణీ జరిగేలా చూశారు.
మరోపక్క చెక్కుల పంపిణీ సమాచారం ఇవ్వడంలో అధికారులు పూర్తి గా నిర్లక్ష్యం వహించారంటూ లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు ఆరోపించారు. కొందరికి చెక్కుల పంపిణీ రోజూ ఉదయం సమాచారం ఇవ్వడంతో హడావిడిగా హాజరైనట్లు తెలిపారు. తోపులాట మధ్య చెక్కు లు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని, చెక్కులు తీసుకుంటున్న క్రమంలో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మం డల ప్రత్యేక అధికారి స్వప్న, తహసీల్దార్ ఫర్హీన్ షేక్, ఎంపీడీవో శంకర్, నాయకులు పాల్గొన్నారు.