హుస్నాబాద్, ఫిబ్రవరి 9: దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుదేనని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ బహుభాషాకోవిదుడు, పరిపాలనాధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నెతెచ్చిన పీవీకి కేంద్రం భారతరత్న ఇవ్వడం ఎంతో గర్వకారణమన్నారు. ఇన్నాళ్లకు పీవీ సేవలకు తగిన గుర్తింపు వచ్చిందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు తీసుకెళ్లి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పీవీ గ్రామీణస్థాయి నుంచి ప్రధానిగా ఎదగడం ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, స్వయంగా మా కుటుంబసభ్యుడైన పీవీకి దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న లభించడం హర్షణీయమన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను అవమానించిందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పీవీ కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చి ఆయన సేవలకు గుర్తింపు ఇచ్చారన్నారు.
గజ్వేల్, ఫిబ్రవరి 9: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు సబ్బుపై పీవీ చిత్రం గీసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని ఢిల్లీలో వినిపించిన పీవీకి అవార్డు రావడం తెలంగాణ సమాజానికి గర్వకారణమన్నారు.