మెదక్, జూన్ 21(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పని విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత సాధనంగా నిలుస్తోంది. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వంగా యోగా గుర్తింపు పొందింది. విద్యార్థులకు చదువుపై దృష్టి కేంద్రీకరించడంలో, ఉద్యోగులకు పనిలో సామర్థ్యం పెంచడంలో యోగా ఎంతో సహాయపడుతుందని అధికారులు తెలిపారు.