రేపటి నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రావొద్దని, అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎవరైనా ఒత్తిడికి గురైతే ‘టెలీ మానస్’కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తారన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వకుంటే ఇంటర్ బోర్డు వెబ్సైట్ http://www.tsbie.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. దూర ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలన్నారు. సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు మాట్లాడుతూ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రికి వివరించారు.
– సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13
సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: ఈ నెల 15 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్తో కలిసి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రంలో ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థుల్లో ఆందోళనను దూరం చేసేలా కౌన్సెలింగ్ అందించేందుకు వీలుగా వైద్యారోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన టెలీ మానస్-14416 ను వినియోగించుకోవచ్చని సూచించారు. పరీక్ష సమయానికి అనుగుణంగా అన్ని ప్రాంతాలకు విధిగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వని పక్షంలో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ http://www.tsbie.cgg.gov.in నుంచి నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యం కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్: 040-24601010, 24655027ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం : సంగారెడ్డి కలెక్టర్ శరత్
మంత్రి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను వివరించారు. అవసరమైన ఏర్పాట్లను ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో హైదరాబాద్ నుం చి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ, సంగారెడ్డి జిల్లా నుంచి ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్ గోవింద్రాం, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్లో మంత్రికి వివరించారు. ఇటీవల సం బంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశామన్నారు. జిల్లాలో 13,616 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఫర్నిచర్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించామని, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులుకు బస్సు సౌకర్య ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా ఇంటర్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 7671033323, 603615652 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం, వైద్యుడు కిరణ్, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.