చేర్యాల/దుబ్బాక, ఆగస్టు 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధి కోసం ప్రజలు ముంబై, బొగ్గుబాయి, దుబాయికి వెళ్లడం తగ్గిపోయింది. ఇతర రాష్ర్టాల కూలీలే ఇక్కడకు వచ్చి పనులు చేసే పరిస్థితిని టీఆర్ఎస్ సర్కారు కల్పించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రాజెక్టులు నిర్మించడం కాల్వల ద్వారా చెరువులు నింపడంతో బోరుబావుల్లో భూగర్భజలమట్టం పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో భూ యజమానులు తమకున్న భూమిలో సాగు చేయసుకోవడంతో కూలీల కొరత ఏర్పడింది. గతంలో సాగు నీరు లేక భూములు పడావుగా ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఎకరా భూమి రూ.40లక్షలు పలుకుతుండంతో ప్రజలు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయం చేసుకోవడంతో అధిక దిగుబడులు సాధించి, గ్రామాల్లో సైతం పట్టణాల్లో ఉన్న విధంగా మోడల్ భవనాలు నిర్మించుకుంటున్నారు. దీంతో భవన నిర్మాణ రంగానికి, వ్యవసాయ రంగానికి సైతం కూలీల కొరత ఏర్పడింది.
గ్రామాలకు చేరుకున్న ఇతర రాష్ర్టాల కూలీలు
పొరుగు రాష్ట్రం నుంచి తరలివచ్చిన కూలీలతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలలో వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో పనులు సకాలంలో జరుగుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఇతర రాష్ర్టాల కూలీలు ఇప్పుడు గ్రామాలకు చేరుకున్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో నిత్యం వేలాది మంది కూలీలు వ్యవసాయ పనులతో పాటు భవన నిర్మాణ రంగాల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. భవన నిర్మాణ రంగాల్లో పనులు చేసేందుకు ఎక్కువ మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాల నుంచి కూలీలు రాగా, వ్యవసాయ రంగంలో మూడేండ్లుగా నాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలు వస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కొనసాగిన సమయంలో తెలంగాణ ప్రాంత కూలీలు ఆంధ్రాలో పని చేశారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చేర్యాల ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు.
పొరుగు రాష్ట్ర కూలీలకు ఉపాధి
మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన కూలీలు భవన నిర్మాణ రంగంలో పని చేస్తుండగా, వీరికి మంచి ఉపాధి లభిస్తున్నది. ఈ రెండు రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీల్లో మహిళలు సైతం ఉన్నారు. భవనాలను కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేయించే కాంట్రాక్టర్లతో పాటు స్వయంగా కూలీ చెల్లించి ఇండ్లు నిర్మించే వారికి పనులు చేసే మేస్త్రీలు స్వయంగా మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు వెళ్లి కూలీలను తెచ్చి, పనులు చేయిస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో మేస్త్రీలకు రోజుకు రూ.వెయ్యి, సిమెంట్, ఇసుక తదితర పారతో పనులు చేసే వారికి రూ.600, మహిళలకు రూ.400 చెల్లిస్తున్నారు. వీరు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనులు చేస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వరినాట్లు వేసే సమయంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో కూలీలు ప్రత్యేక వాహనాల్లో వచ్చి రెండు నెలల పాటు ఇక్కడే ఉండి పనులు చేసుకుంటున్నారు. కూలీలు ఎకరా పొలం నాటు వేస్తే వారికి రూ.5500 రైతు చెల్లిస్తున్నారు. అదే లోకల్ కూలీలు ఎకరం పొలం నాట్లకు రూ.7వేలు డిమాండ్ చేస్తుండడంతో రైతులు పొరుగు రాష్ర్టాల కూలీలకు పనులు అప్పగించి, సకాలంలో పనులు చేయిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలకు భోజనం తదితర వసతులు సైతం రైతులే కల్పిస్తున్నారు. వలస కూలీలతో పనుల్లో వేగంతో పాటు తక్కువ ఖర్చుతో పని జరుగుతున్నదని భవన నిర్మాణ మేస్త్రీలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వలస కూలీలకు తెలంగాణలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని సంబురపడుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయని పేర్కొటున్నారు. తెలంగాణ ప్రజల మంచితనం, మర్యాదలు తమకు ఎంతో నచ్చాయంటున్నారు.
వలస కూలీలకు సిద్దిపేట జిల్లా జీవన భరోసానిస్తున్నది. రాష్ట్ర సర్కారు చేపట్టిన పథకాలతో ఈ ప్రాంతంలో ఎవుసం పండుగలా సాగుతుండగా, పంటల దిగుబడి పెరుగుతున్నది. సాగు నీరు సరిపడా అందుతుండగా, రెండు, మూడు పంటలకూ ఢోకా లేకుండా పోతున్నది. దీంతో ఆయా రాష్ర్టాల్లో పనుల్లేక కుటుంబ పోషణకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఏపీ నుంచి ఇక్కడికి వస్తున్న కూలీలను అమ్మలా ఆదుకుంటున్నది. నాట్లు వేయడం నుంచి భవన నిర్మాణ పనులు దాకా ఇక్కడ వారికి పనులు లభిస్తుండగా, ఆయా కుటుంబాలకు బతుకు దెరువు లభిస్తున్నది.
పనికి తగినంత డబ్బు ఉంది..!
నేను గతేడాది తెలంగాణకు వచ్చిన. బిల్డింగ్ పనుల్లో లేబర్గా చేస్తా. నాకు రోజుకు రూ.500 ఇస్తారు. ఇదే పనికి మా రాష్ట్రంలో రూ.200 ఇస్తారు. ఇక్కడ పనికి తగినంత ఉంది. ఇక్కడ మంచి సర్కారు ఉంది. మా రాష్ట్రంలో పని కల్పించే సర్కారు లేదు. మా బంధువులు చాలా మంది ఇక్కడ పని చేస్తున్నారు. నెలకు రూ. 7 వేలు వరకు ఇంటికి పంపిస్తున్నా. ముఖ్యంగా ఇక్కడి ప్రజల మంచితనం, మర్యాద చాలా బాగుంది.
– కార్తీక్రామ్, కూలీ, ఛత్తీస్గఢ్
అదృష్టంగా భావిస్తున్నా
తెలంగాణలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఐదేండ్లుగా తెలంగాణలో ఉపాధి పొందుతున్న. కర్ణాటక, చెన్నైలో పని చేసిన. అక్కడితో పోల్చితే తెలంగాణలోనే ఆదాయం ఎక్కువగా వస్తున్నది. చేసుకున్న వారికి చేసుకున్నంత పని దొరుకుతున్నది. నేను మేస్త్రీగా పని చేస్తా. నాకు రోజుకు రూ.900 ఇస్తున్నారు. నాతో పాటు ఒక్కోసారి నా భార్య కూడా పనికి వస్తుంది. మా ఖర్చులు పోనూ నెలకు రూ.10 వేల వరకు దాచుకుంటున్నాం.
– అశోక్, కూలీ, మధ్యప్రదేశ్
పనికి, పైసాకు ఢోకా లేదు!
మా రాష్ట్రంలో పని లేక మేం ఇక్కడికి వచ్చాం. అక్కడ అంతా పేదరికం. మా గురించి పట్టించుకునే సర్కారు లేదు. తెలంగాణలో పేదోళ్ల కు సర్కారు అండగా ఉంది. ఇక్కడ కావాల్సినంతా పని, పనికి తగినంతా పైసలు ఇస్తారు. ఇదే పని మా రాష్ట్రంలో చేస్తే, సగం డబ్బులు కూడా రావు. వారానికోక రోజు ఆదివారం సెలవు తీసుకుంటున్నాం. నెలకు రూ. 15వేల నుంచి రూ.20 వేలు సంపాదిస్తున్నాం. సగం డబ్బులు పొదుపు చేస్తున్న.
– రాస్సపోల్, కూలీ, ఛత్తీస్గఢ్
పనులు పూర్తి చేస్తున్నాం..
జిల్లాలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయ పనులు పెరిగాయి. గతంలో నీళ్లు లేక సాగు పనులు జరిగేవి కావు. కొద్దిపాటి భూమి ఉన్న వారు సైతం బిల్డింగ్ పనులకు వచ్చే వాళ్లు. అప్పుడు మాకు సమస్య ఉండేది కాదు. ఇప్పుడు నీళ్లు రావడంతో ఎక్కువ శా తం మంది పొలం పనులు చేస్తున్నారు. నేను బీహార్ నుంచి కూలీలను తీసుకొచ్చి, పనులు చేయిస్తున్న.
– కుర్రారం బాల్ నర్సయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల మాజీ అధ్యక్షుడు, చేర్యాల
రెండు నెలలు పనులు
మా రాష్ట్రంలో పనుల్లేవ్. తెలంగాణలో రెం డు నెలల వరకు మాకు పనులు దొరుకుతాయి. యేటా నాతో పాటు మా ఊరి వాళ్లు ఇక్కడి వస్తాం. పనులు చేసుకొని వెళ్లిపోతాం. మా దగ్గర కూలి తక్కువ. తెలంగాణలో ఎక్కువ. మా గ్రామం నుంచి 30 నుంచి 50 మంది వరకు వచ్చి వ్యవసాయ నాట్లు వేసి వెళ్లిపోతున్నాం. రెండు నెలల పాటు ఇక్కడ తమకు పనులు దొరుకుతున్నాయి. ఇక్కడి సర్కారు సౌలత్లతో పంటలు బాగా పండుతున్నాయి.
– రంజిత్, కూలీ, పశ్చిమ బెంగాల్
ఖర్చులు ఎక్కువ.. పనులు తక్కువ
మధ్యప్రదేశ్లో ఖర్చులు ఎక్కువ. పనులు తక్కువ. భవన నిర్మాణ పనుల కోసం ఇక్కడి వచ్చాం. మాకు ఇక్కడ రోజూ పని దొరుకుతున్నది. దీంతో కుటుంబ సభ్యులం ఆనందంగా ఉంటున్నాం. తెలంగాణ కూలీలు కూడా మాతో పనులు చేస్తున్నారు. వారు స్నేహపూర్వకంగా ఉండడం ఆనందంగా ఉంది. ఇంకా మా ప్రాంతం నుంచి కూలీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
– దినేశ్, కూలీ, మధ్యప్రదేశ్