మెదక్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15 వ తేదీ వరకు మూడు విడుతల్లో ప్రాక్టికల్ నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో సైన్స్ గ్రూపులకు సంబంధించిన ద్వితీయ సంవత్సరం 3594 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ప్రథమ సంవత్సరం 602 మంది, ద్వితీయ సంవత్సరం 528 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. జనరల్ ఒకేషనల్ గ్రూపుల కోసం 35 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 16వ తేదీన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని, పరీక్షా సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు.
గత సంవత్సరం ఫస్టియర్లో నైతికత- మానవ విలువలు పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీన పరీక్ష ఉంటుందని, 19న ఫస్టియర్ విద్యార్థులకు పర్యావరణ విద్యా పరీక్ష నిర్వహిస్తామని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి విద్యార్థులు పరీక్షలు రాసేలా చూసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా హైపవర్ కమిటీని ఇంటర్మీడియట్ బోర్డు నియమించింది. ఈ కమిటీలో ఎస్పీ, పోలీస్ కమిషనర్, ఇంటర్మీడియట్ ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సభ్యులుగా ఉంటారన్నారు. వీరి తో పాటు అదనంగా డీసీ మెంబర్లు, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు పరీక్షా నిర్వహణను పర్యవేక్షిస్తుంటాయని తెలిపారు. హాల్ టికెట్ల జారీ విషయంలో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.